Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారు తీరు..అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లు ఉందా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:15 AM GMT
తెలంగాణ సర్కారు తీరు..అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లు ఉందా?
X
సామెతలకున్న మంచిగుణం. పెద్ద విషయాన్ని.. సింఫుల్ గా చిన్న మాటతో చెప్పేయటం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో చాలామందికి గుర్తుకు వస్తున్న సామెత.. ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అని. మరి.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న పరిస్థితులు చాలామందిలో కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షల మీద అనుసరిస్తున్న కట్టడి వ్యూహం ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉందని చెబుతున్నారు.

దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో నిర్దారణ పరీక్షలు చాలా తక్కువగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేవాళ్లు కనిపించరు. రోజు రోజుకి పెరుగుతున్న కేసుల నేపథ్యం లో ఎవరికి వారికి వచ్చే అనుమానాల్ని తీర్చుకునేందుకు వీలుగా నిర్దారణ పరీక్షలు చేయించుకోవటానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే.. పరీక్షలు చేయాల్సిన వారు.. కొన్ని ప్రశ్నలు అడిగి.. మీకు పరీక్ష అవసరం లేదని తేల్చేయటం ఇప్పుడో తల నొప్పిగా మారుతోంది.

తొలినాళ్లలో ఎవరికైనా పాజిటివ్ అని తేలిన వెంటనే.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు.. అతను కాంటాక్టు ఉన్న వారి లిస్టు తీసి.. వారికి సైతం పరీక్షలు జరిపేవారు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే.. ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలితే.. అతను పని చేసే చోట అతనికి చెరో పక్క కూర్చున్న ఇద్దరికి మినహా నిర్దారణ పరీక్షలు చేయని వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇప్పుడు అసలు సమస్య ఏమంటే.. ఆ ఆఫీసులో.. సదరు పాజిటివ్ వచ్చిన వ్యక్తికి దగ్గరగా మెలిగిన వారందరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు నిర్దారణ పరీక్షలు చేయాలని కోరుతున్నా అధికారులు అక్కర్లేదంటున్నారు. సర్లే.. ప్రైవేటుగా చేయించుకుందామంటే.. ప్రభుత్వ అనుమతి ఇచ్చింది లేదు. దీంతో.. మాయదారి రోగం తమకేమైనా అంటిందా? అన్న భయాందోళనల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇదంతా చూసినప్పుడు అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్న సామెత గుర్తుకు రావటం ఖాయం. అనారోగ్య లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు జరపాలే కానీ మిగిలిన వారెవరికీ పరీక్షల అవసరం లేదన్న వాదనలో ఉన్న లాజిక్ ఏమిటో అర్థం కావట్లేదని ప్రభుత్వ అధికారులు సైతం ప్రైవేటు సంభాషణల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలో పెరిగి పోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఐసీఎంఆర్ కొన్ని షరతులతో ప్రైవేటు ల్యాబ్ లలో పరీక్షలు జరిపేందుకు.. ప్రైవేటు ఆసుపత్రుల్లోచికిత్సకు అనుమతించింది. ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నా.. తెలంగాణలో మాత్రం అలాంటివేమీ లేకపోవటం విశేషం.

ఆర్థికంగా స్థోమత ఉన్న వారు ప్రైవేటు ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకునేలా.. ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అలా చేస్తే సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం వాదించింది. అయినప్పటికీ కోర్టు ఆ వాదనను తోసిపుచచి.. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకోవచ్చని.. ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ.. హైకోర్టు ఆదేశాలు తెలంగాణలో అంతగా అమలు కావట్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఆందోళనల్ని తగ్గించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ టెన్షన్ అంతకంతకూ పెంచే బదులు.. దాన్ని తగ్గించేలా కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే మంచిది. మరి.. ఆ దిశగా ప్రభుత్వం ఎప్పటికి ఆదేశాలు జారీ చేస్తుందో?