Begin typing your search above and press return to search.

95 శాతం దాటిన రిక‌వ‌రీ రేటు...సెకండ్‌ వేవ్‌ తగ్గినట్లేనా ?

By:  Tupaki Desk   |   22 Jun 2021 6:38 AM GMT
95 శాతం దాటిన రిక‌వ‌రీ రేటు...సెకండ్‌ వేవ్‌ తగ్గినట్లేనా  ?
X
మనదేశంలో క‌రోనా వైరస్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం చాలావ‌ర‌కు త‌గ్గింది. అయినా, ప్రతిరోజూ 15 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా కొవిడ్‌ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. ప‌రీక్ష‌లు భారీగా నిర్వ‌హిస్తున్నా పాజిటివిటీ రేటు అంత‌కంత‌కే ప‌డిపోతూ రిక‌వ‌రీ రేటు పెరుగుతూ వ‌స్తున్న‌ది. ప్ర‌తిరోజూ పెద్ద సంఖ్య‌లో బాధితులు మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 95 శాతం దాటేసింది. దేశంలో వరుసగా 14వ రోజు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదయ్యింది. అంటే ప్రతి 100 టెస్టుల్లో 5 శాతంలోపే పాజిటివ్‌ గా తేలుతున్నాయి. వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే, పరిస్థితి ఆశాజనంగా మారినట్లు ఇప్పుడే నిర్ణయానికి రావొద్దని సైంటిస్టులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనాలో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, జాగ్రత్తలు కొనసాగించక తప్పదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలను నమ్మలేమని అంటున్నారు. సెకండ్‌ వేవ్‌ ముగింపు ఇప్పుడే కాదు. డెల్టా ప్లస్‌ లాంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ వేవ్‌ అంతం కావడానికి ఇంకా సమయం ఉంది అని ఢిల్లీలోని శివనాడార్‌ వర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నాగసురేష్‌ వీరపు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్టు వేవ్‌ ముగిసిందన్న భావనతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇంతలోనే సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడిందని గుర్తుచేశారు. పస్ట్‌ వేవ్‌ లో పాజిటివిటీ రేటు ఒక శాతంగా ఉన్నప్పుడు సెకండ్‌ వేవ్‌ మొదలైందన్నారు. కేసుల సంఖ్య తగ్గింది అంటే సెకండ్‌ వేవ్‌ ముగిసినట్లు కాదని చెప్పారు.

దేశంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే అధికంగా ఉందని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా తెలిపారు. రోజువారీ పాజిటివ్‌ కేసులు అధికంగా∙నమోదవుతున్నాయన్నారు. దేశమంతటా అన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తగ్గేదాకా వేచిచూడాలని, ఇది రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కొనసాగితేనే సెకండ్‌ వేవ్‌ అంతమవుతున్నట్లు గుర్తించాలన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 91 రోజుల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,77,861కి చేరింది. ఇందులో 6,62,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 81,839 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,89,26,038కి చేరింది. ఇక , నిన్న 1,167 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,89,302 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 28,87,66,201 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.