Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా విలయం .. కొనసాగుతున్న ప్రపంచ దేశాల సాయం !

By:  Tupaki Desk   |   12 May 2021 11:30 PM GMT
భారత్ లో కరోనా విలయం ..   కొనసాగుతున్న ప్రపంచ దేశాల సాయం !
X
కరోనా కేసులతో అల్లాడుతున్న భారత్‌ కు ప్రపంచంలోని పలు దేశాలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు సాయం కొనసాగిస్తున్నాయి. ‘యూఎస్‌ ఎయిడ్‌’ పేరిట అమెరికా 100 మిలియన్‌ డాలర్ల విలువైన సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 6 విమానాల్లో వైద్య అత్యవసర పరికరాలు, ఔషధాలు, వస్తువులను పంపింది. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా భారత్‌ కు సహకారం అందిస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ 1.25 లక్షల రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్లు , 1,500 ఆక్సిజన్‌ సిలిండర్లు, 550 మొబైల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లు, 25 లక్షల ఎన్‌-95 మాస్కులు, 210 పల్స్‌ ఆక్సీమీటర్లు పంపాం అని ఆ దేశం వెల్లడించింది.

ఇక నెదర్లాండ్స్, యూఏఈ, స్విడ్జర్లాండ్‌ నుంచి కూడా భారత్‌ కు వైద్య పరికరాలు, ఔషధాలు విమానాల్లో వచ్చాయి. ఆయా దేశాల నుండి వైద్య పరికరాలతో వచ్చిన విమానాలు ఢిల్లీ కి చేరుకున్నాయి. ఐరాస అనుబంధసంస్థలు యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌ వో, యూఎన్‌ ఎఫ్‌ పీఏలు కలిసి ఇప్పటివరకు 10 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపాయి. కోటికిపైగా మెడికల్‌ మాస్కులను చేరవేశాయి. ఈ విషయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ తెలిపారు. ఇక దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 3,55,338 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకున్నారు. 37,04,099 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు వేశారు.