Begin typing your search above and press return to search.

అమెరికాను దాటేసిన ఇండియా .. ఒక్కరోజే 3,14,835 కేసులు !

By:  Tupaki Desk   |   22 April 2021 5:46 AM GMT
అమెరికాను దాటేసిన ఇండియా .. ఒక్కరోజే 3,14,835 కేసులు !
X
కరోనా వైరస్ మహమ్మారి‌ పీడ భారత్ ను వీడటం లేదు. తాజాగా సెకండ్ వేవ్ లో అమెరికా రికార్డును సైతం భారత్ అధిగమించి ప్రమాదకర స్థాయిలో పయనిస్తోంది. ఒకే రోజు అత్యధిక కేసుల నమోదులో భారత్.. అగ్రరాజ్యాన్ని అధిగమించింది. గత 24 గంటల్లోనే భారతదేశంలో ఏకంగా 3,14,835 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు మరే దేశంలో కూడా నమోదు కాలేదు. ఒక్కరోజుల నమోదు అయిన కేసుల్లో ప్రపంచంలో ఇదే ప్రస్తుతానికి అత్యథికం. దీంతో జనవరి 8 న అమెరికా పేరిట నమోదైన ఒకే రోజులో అత్యధిక కేసుల ( 3,07,581) రికార్డును భారత్‌ దాటేసింది. సెకెండ్ వేవ్ లో భాగంగా గత రెండు వారాల కిందట ఇండియాలో లక్ష కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రపంచంలోనే ఒక్కరోజులోనే ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చాయి.

జనవరి తర్వాత అమెరికా లో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టగా..భారత్ లో కొంచెం కొంచెం గా తన ఉగ్రరూపం చూపిస్తూ వచ్చింది. ప్రస్తుతం రోజుకి మూడు లక్షలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో అత్యథికంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ లో కూడా ఈ రాష్ట్రమే అత్యథికంగా కరోనా కేసులు నమోదుచేసే రాష్ట్రంగా నిలిచింది. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 (1.59 కోట్లు) కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,84,657కు పెరిగింది. ఇక బుధవారం కేంద్రం విడుదల చేసిన కరోనా కేసుల వివరాలని ఒకసారి పరిసలిస్తే..మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,39,357 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,95,041 మందికి పాజిటివ్‌ అని తేలింది. అలాగే , మరో 2023 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కేంద్రం టీకా పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేసింది. ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు కూడా టీకాలు ఇవ్వబోతోంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,23,30,644 డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.