Begin typing your search above and press return to search.

దేశంలో రోజుకు లక్ష కేసులు.. ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   19 Sep 2020 4:30 AM GMT
దేశంలో రోజుకు లక్ష కేసులు.. ఎప్పుడంటే?
X
క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ మీద ప్రకటనలు అయితే వస్తున్నాయే కానీ.. పరిష్కార మార్గం లభించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. అంతకంతకూ విస్తరిస్తున్న కేసులతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొదట్లో రోజుకు పది వేల కేసులు నమోదుకు వారాల తరబడి సమయం తీసుకున్నది కాస్తా.. ఇప్పుడు అందుకు భిన్నంగా రోజుకు 95వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

వైరస్ విస్తరిస్తున్న తీరు.. కేసులు నమోదువుతున్న వేగాన్ని చూస్తే.. రోజులో లక్ష కేసులు నమోదయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న అంచనా వినిపిస్తోంది. ఇప్పుడున్న జోరు ఇదే తీరులో కొనసాగితే కనిష్ఠంగా వారంలో గరిష్ఠంగా పన్నెండు రోజుల్లో రోజులో లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. కేసుల నమోదు భారీగా పెరుగుతున్న ఆందోళన కొనసాగుతుంటే.. మరోవైపు ఊరట కూడా అదే స్థాయిలో ఉందని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. రికవరీ రేటు కూడా భారీగా ఉండటమే కారణం. శుక్రవారం సంగతే చూసుకుంటే.. దేశ వ్యాప్తంగా కొత్త కేసులు 96 వేలు నమోదైతే.. రికవరీ 87వేలకు పైనే కావటం గమనార్హం. ఇక.. టెస్టులు కూడా భారీగా పెంచేశారు. ఇప్పుడు రోజుకు 11 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త కేసుల నమోదు విషయాన్ని చూస్తే.. మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతానికి పైగా కేసులు కేవలం ఏడు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

శుక్రవారం విషయాన్నే తీసుకుంటే మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 24, 619 కేసులు నమోదైతే.. కర్ణాటకలో 8,626 కేసులు.. ఏపీలో 8,096 కేసులు.. యూపీలో 6,029 కేసులు.. తమిళనాడులో 5,488 కేసులు.. ఢిల్లీలో 4,432 కేసులు.. కేరళలో 4,351 కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదు మాత్రమే కాదు.. మరణాల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 468 మంది మరణిస్తే.. కర్ణాటకలో 179, యూపీలో 81, తమిళనాడు 67, ఏపీలో 67 మంది మరణించారు.

కేసులు తక్కువగా నమోదై.. మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలుగా పశ్చిమబెంగాల్ 60.. పంజాబ్ 54 నిలిచాయి. ఒకరోజులో దేశ వ్యాప్తంగా వైరస్ కారణంగా మరణించిన మరణాల్లో 40 శాతానికి పైనే ఒక్క మహారాష్ట్రలోనే చోటు చేసుకోవటం గమనార్హం.