Begin typing your search above and press return to search.

ఏపీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వణుకు!

By:  Tupaki Desk   |   27 Feb 2021 8:30 AM GMT
ఏపీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వణుకు!
X
వారు మామూలు వారు కాదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాడిన యోధులు. కరోనా లాంటి మహమ్మారికి చిక్కకుండా తమను తాము కాపాడుకుంటూనే.. ప్రజల్ని కాపాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఎంతో ఆత్రంగా ఎదురుచూసినోళ్లు. తీరా.. టీకా వచ్చిన తర్వాత వేసుకోవటానికి ముందుకు రాని తీరు ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. దాన్ని వేసుకోవటానికి మాత్రం ససేమిరా అంటున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ సంఖ్య ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది.

అన్ని తెలిసిన వారే వ్యాక్సిన్ కు దూరంగా ఉంటే.. సామాన్యుల మాటేమిటి? వారిలో మరింత భయాందోళనలు పెరగవా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మార్చి ఒకటి నుంచి సామాన్యులకు సైతం టీకాను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న వేళ.. టీకా మీద ఉన్న అపోహల్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో టీకా కోసం 9.94లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో 3.94 లక్షల మంది కేవలం వైద్య సిబ్బంది కాగా.. 6లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు.. ఉద్యోగులు ఉన్నారు. వీరందరికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

అయినప్పటికీ వ్యాక్సిన్ వేయించుకున్నవారు ఎంతమందో తెలుసా? కేవలం 2.18లక్షల మంది మాత్రమే. అంటే దగ్గర దగ్గర 22 శాతం మంది మాత్రమే టీకా వేయించుకోవటానికి ముందుకు వచ్చారన్న మాట. ఎందుకిలా అంటే.. అనవసరమైన అపోహలే కారణంగా చెప్పాలి. టీకా మీద ఉన్న సందేహాలతో ఎందుకొచ్చిన రిస్కు అంటూ వెనకడుగు వేయటంతోనే ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. కరోనా మరోసారి తన ప్రతాపాన్ని చూపించటం షురూ చేసిన వేళ.. టీకా పంపిణీని మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం ప్రాదాన్యత ఇవ్వటం.. అపోహల్ని తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టాల్సిందే. లేకుంటే.. మరోసారి ముప్పు తప్పదు.