Begin typing your search above and press return to search.

కరోనా అప్డేట్: గిద్దలూరు ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎంకు పాజిటివ్

By:  Tupaki Desk   |   4 Aug 2020 5:00 AM GMT
కరోనా అప్డేట్: గిద్దలూరు ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎంకు పాజిటివ్
X
దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. కర్ణాటకలో అయితే దారుణంగా ఇప్పటికే సీఎం యడ్యూరప్పకు కరోనా సోకగా.. తాజాగా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో సీఎంకు, ప్రతిపక్ష నేత ఇద్దరికీ కరోనా రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇక ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య ఏపీలో 7822 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో ఏకంగా 63మంది ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలో మొత్తం కేసులు 166586కు చేరాయి. మృతుల సంఖ్య 1537కు పెరిగింది.

* ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులకు కరానో పాజిటివ్ సోకింది. చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. నియోజకవర్గ పరిధిలో కలిసిన ప్రజలను టెస్ట్ లు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

*ఇక కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిచెందడం విషాదం నింపింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకింది. విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా సోమవారం అర్ధరాత్రి దాటాక మరణించారు.

*ఏపీలో 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1113 మందికి.. విశాఖలో 1049మందికి, అనంతపురంలో 953మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు ఏపీలో అత్యధికంగా 23314మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత కర్నూలులో 19679మందికి సోకింది.

*ఇక తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11మంది కరోనాతో మరణించారు.

*దేశంలో మొత్తం కేసులు 18లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 52972 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 771మంది మరణించారు. మొత్తం మరణాలు 38135 దాటాయి.