Begin typing your search above and press return to search.

ప్రజల్లోకి అరుణమ్మ..బీజేపీలో కలకలం!

By:  Tupaki Desk   |   12 Dec 2019 11:48 AM GMT
ప్రజల్లోకి అరుణమ్మ..బీజేపీలో కలకలం!
X
తెలంగాణ బీజేపీకి దిక్కెవరు అని ప్రశ్నిస్తే సూటిగా ఓ పెద్ద నాయకుడు.. నడిపించే నేత పేరు చెప్పడం కష్టమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నిలదొక్కుకున్నా కేసీఆర్ ను ఢీకొట్టేంత నేత మాత్రం ఆ పార్టీకి ఇప్పటికీ లేరనే చెప్పాలి.

ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వైఖరి ‘అవ్వ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్నట్టుగా ఉందని కమలనాథులు రగిలిపోతున్నారట.. ఆయన అధ్యక్ష పదవిని విడవకుండా ప్రజల్లోకి వెళ్లకుండా పోరాటం చేయకుండా స్తబ్దుగా ఉంటున్నారని మథనపడుతున్నారట... వేరే నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం లేదట.. సో ఇక ఉండబట్టలేక మన గద్వాల జేజమ్మ అరుణక్క తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో సంప్రదించకుండానే పోరుబాట పట్టారు.

తెలంగాణలో మద్యనిషేధం అమలు చేయాలని.. దిశ హత్యకు మద్యమే కారణమంటూ డీకే అరుణ రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు. ఇందిరా పార్క్ వద్ద అరుణ దీక్షతో బీజేపీలో కలకలం రేపబోతున్నారు.

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనుమతి లేకుండానే డీకే అరుణ ప్రజల్లోకి వెళ్లడం కమలదళంలో హాట్ టాపిక్ గా మారిందట.. తనను బీజేపీలో చేర్పించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మద్దతుతోనే డీకే అరుణ ఈ పోరుబాట మొదలు పెట్టారట..

రాంమాధవ్ ఆశీస్సులతో ప్రజల్లోకి వెళ్లిన జేజమ్మ అసలు టార్గెట్ బీజేపీ అధ్యక్ష పీఠమని.. అందుకోసమే ఈ పోరాటం మొదలు పెట్టారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఒక లేడీ టైగర్ అయితే బీజేపీలో బలంగా ముందుకొస్తున్నారు. మరి ఆమెను ఎదగనిస్తారా? తొక్కేస్తారా అన్నది వేచిచూడాలి.