Begin typing your search above and press return to search.

వైసీపీ 'పెద్ద‌'ల‌పై క్రిమిన‌ల్ కేసులు.. రాజ్య‌స‌భ స‌భ్యుల నేర చ‌రిత్ర ఇదే!

By:  Tupaki Desk   |   29 Jun 2022 5:27 AM GMT
వైసీపీ పెద్ద‌ల‌పై  క్రిమిన‌ల్ కేసులు.. రాజ్య‌స‌భ స‌భ్యుల నేర చ‌రిత్ర ఇదే!
X
రాజ్యసభ సభ్యుల్లో 31 శాతం మంది పెద్ద‌ల‌పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. అందులోనూ 16 శాతం మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు.. 87 శాతం కోటీశ్వరులుగా తెలిపింది. ఇక‌, నేర ఆరోప‌ణ‌లుఎదుర్కొంటున్న వైసీపీ స‌భ్యులు ముగ్గురు ఉన్నారు. వీరిపైనా క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత సభ్యుల్లో 31 శాతంపై (71 మంది) క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు జాతీయ ఎన్నికల నిఘాసంస్థ 'అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌' (ఏడీఆర్‌) ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో 37 మందిపై (16%) నేరారోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇద్దరిపై హత్యానేరం అభియోగాలు కూడా ఉండటం గమనార్హం. మరో నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

నలుగురు ఎంపీలపైన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కె.సి.వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈయన రాజస్థాన్‌ నుంచి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పార్టీలపరంగా పరిశీలిస్తే.. బీజేపీకి చెందిన 85 మంది రాజ్యసభ సభ్యులకుగాను 20 మందిపై (24%), కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 31 మంది సభ్యులకుగాను 12 మందిపై (39%), తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది సభ్యులకుగాను ముగ్గురిపై (23%), ఆర్జేడీకి చెందిన ఆరుగురు సభ్యులకుగాను అయిదుగురిపై (83%) క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.

క‌మ్యూనిస్టులూ ఇదే జాబితాలో..క‌మ్యూనిస్టు పార్టీ అయిన‌.. సీపీఎంకు చెందిన అయిదుగురు సభ్యులకుగాను నలుగురిపై (80%), ఆప్‌ సభ్యులు 10 మందికి గాను ముగ్గురి (30%)పైన, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు 9 మందికి గాను ముగ్గురి(33%) పైన, ఎన్సీపీ సభ్యులు నలుగురికి గాను ఇద్దరిపై (30)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఆయా సభ్యులు అఫిడవిట్లలో స్వీయ వెల్లడి కింద పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 28 మందిపై అభియోగాలు తీవ్రంగా ఉన్నాయి.

కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన 197 మంది సభ్యుల సగటు ఆస్తి రూ.79.54 కోట్లుగా నివేదిక పేర్కొంది. సభలోని మొత్తం 233 మంది సభ్యులకు గాను 226 మంది సభ్యుల ఆర్థిక నేపథ్యాన్ని, నేరచరిత్రను ఈ సంస్థ విశ్లేషించింది. సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఇద్దరు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేనందున వారి గురించి విశ్లేషించలేదు. జమ్మూకశ్మీర్‌కు చెందిన నాలుగు స్థానాలు పరిగణనలోకి తీసుకోలేదని నివేదికలో వివరించారు. 226 మంది రాజ్యసభ సభ్యుల్లో 197 మంది (87 శాతం) కోటీశ్వరులు.