Begin typing your search above and press return to search.

డెక్కన్ ఛార్జర్స్‌ కేసులో బీసీసీఐకి ఊరట ... కేసును కొట్టేసిన కోర్టు

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
డెక్కన్ ఛార్జర్స్‌ కేసులో బీసీసీఐకి ఊరట ... కేసును కొట్టేసిన కోర్టు
X
గత కొన్ని రోజులుగా డెక్కన్ ఛార్జర్స్‌ , బీసీసీఐల మధ్య కోల్డ్‌ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ఐపీఎల్ టీం అయిన డెక్కన్ ఛార్జర్స్‌, బాంబే హైకోర్టులో వేసిన ఓ కేసులో బీసీసీఐ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. డీసీహెచ్‌ ఎల్ కు రూ. 4,800 కోట్లు చెల్లించాలంటూ ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జ‌స్టిస్ జీఎస్ ప‌టేల్‌ తో కూడిన బెంచ్ తాజాగా ఈ ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ కోర్టు తీర్పు భారీ ఊరటనిచ్చిందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే చేశామ‌ని వెల్లడించారు.

2008 నుంచి ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ లో దక్కన్‌ చార్జర్స్‌ టీం ఉన్నది. 2009లో ఆ జట్టు ఛాంపియన్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌ను డీసీహెచ్‌ ఎల్‌ కంపెనీ ప్రమోట్‌ చేసింది. కాగా, 2012లో డీసీహెచ్‌ ఎల్‌ రూ.100 కోట్లకు షూరిటీ ఇవ్వడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్‌ నోటీసు పంపింది. దీంతో బీసీసీఐ, డీసీహెచ్‌ ఎల్‌ ల మధ్య వివాదం రాజుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఛార్జర్స్‌ కు 30 రోజుల గడువు ఇచ్చింది బీసీసీఐ. అయితే, ఈ గడువు పూర్తి కాకముందే 2012లో డీసీ టీమ్‌ ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దక్కన్‌ చార్జర్స్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేరింది. అయితే ఐపీఎల్‌ లీగ్‌ నుంచి డీసీ ని తప్పించడం చట్ట విరుద్ధమని డీసీహెచ్‌ఎల్‌ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద రూ. 8 వేల కోట్లు బీసీసీఐ చెల్లించాలని దక్కన్‌ ఛార్జర్స్‌ కోర్టును కోరింది. ఈ మేరకు బీసీసీఐ.. ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ కోర్టు అభిప్రాయపడింది. దీనికి నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్‌ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. దీనిపై బీసీసీఐ కోర్టుని ఆశ్రయించగా తాజాగా కోర్టు దాన్ని కొట్టివేసింది.