Begin typing your search above and press return to search.

మండలి రద్దు: కేంద్రం ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   27 Jan 2020 9:52 AM GMT
మండలి రద్దు: కేంద్రం  ఏం చేస్తుంది?
X
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఆమోదిస్తారు కూడా.. అయితే ఇప్పుడు జగన్ సర్కారు రద్దు చేసిన మండలి వెంటనే రద్దు అవుతుందా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రద్దు అమల్లోకి రావాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుందని శాసన వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుండబద్దలు కొడుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతోనూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో శాసన మండలిలు రద్దు చేశారు. ప్రస్తుతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే శాసనమండళ్లు పనిచేస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో మాత్రమే మండళ్లు ఉన్నాయి. గతంలో రద్దు చేసి ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలని తమిళనాడు, బెంగాల్, పంజాబ్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నాయి. ఇక తమకు కొత్తగా మండలి కావాలని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఒడిషా, రాజస్థాన్ లు కోరుతున్నాయి.

ఇప్పటికే ఇన్ని పెండింగ్ మండళ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉండగా.. ఏపీ నుంచి రద్దు చేయాలని ప్రతిపాదన రావడంతో కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. సొంత పార్టీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రతిపాదనల పైనే ఇంకా బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను అంత ఈజీగా అమలు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఇదే విషయాన్ని యనమల నొక్కి చెబుతూ ఏపీ మండలి రద్దు కావాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుందని.. అప్పటి వరకూ మండలిలో వైసీపీ కి మెజార్టీ వస్తుందని.. ఇది వృథా ప్రయాస అని చెబుతున్నారు.