Begin typing your search above and press return to search.

వరల్డ్ అప్డేట్: 12 లక్షలు దాటిన కరోనా బాధితులు

By:  Tupaki Desk   |   5 April 2020 5:37 AM GMT
వరల్డ్ అప్డేట్: 12 లక్షలు దాటిన కరోనా బాధితులు
X
కరోనా రక్కసి ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తూనే ఉంది. ప్రపంచంలోని 205 దేశాలకు ఇది వ్యాపించింది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవనోపాధిని కూడా దూరం చేస్తోంది. దీని ధాటికి సగం దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. 350 కోట్ల మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. యూరప్ - అమెరికాలో మరణ మృదంగం వాయిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల 64400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 12 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 5500 మంది మృతి చెందారు.2.46 లక్షల మంది కోలుకున్నారు.

ఆమెరికాలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు. ఒక్కరోజులోనే 1100 మంది కన్నుమూత పడ్డారు. శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా అక్కడ మృత్యువు కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ గడిచిన 24 గంటల్లో (శుక్రవారం - శనివారాల్లో) ఇంత ప్రాణనష్టం వాటిల్లలేదు.

గురువారం - శుక్రవారం మధ్య ఏకంగా 1321 మంది కరోనా రోగులు మరణించడం కలకలం రేపింది. ఒక్క రోజులో మరణించిన వారిలో ప్రపంచంలోనే ఇదే అత్యధికంగా అధికారులు చెబుతున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోనే ఏకంగా 630మంది మరణించారు. అంటే ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒకరి ప్రాణం పోయినట్టు. దీంతో న్యూయార్క్ ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు. అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 7వేలు దాటింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 2.70 లక్షలు దాటింది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

కరోనా ధాటికి ఇటలీలో 800 మంది చనిపోయారు. ఇటలీలో మరణాల సంఖ్య 15వేలు దాటింది. వ్యాధిగ్రస్తుల సంఖ్య 1.24 లక్షలు దాటింది. బ్రిటన్ లో నాలుగోరోజు మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అమెరికాలో సేవల కోసం చైనా వైద్యసిబ్బందిని పంపడానికి రెడీ అయ్యింది. కానీ అమెరికా ఒప్పుకుటుందో లేదో తెలియదు.

ఇక శనివారం స్పెయిన్ లో 900మందికి పైగా మరణించారు. కరోనా కేసుల సంఖ్య 1.26 లక్షలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 11,947కు చేరింది.

బ్రిటన్ లో 41వేల కేసులు.. 4313మంది మరణాలు చోటుచేసుకున్నాయి. జర్మనీలో 96వేల కేసులు.. 1444 మంది చనిపోయారు. ఫ్రాన్స్ లో 7560మంది ప్రాణాలు కోల్పోగా.. 89వేల కేసులు నమోదయ్యాయి. ఇరాన్ లో 3452 మంది చనిపోగా.. 55వేల మంది వైరస్ బారిన పడ్డారు.

కరోనా మరణాల నేపథ్యంలో చైనా శనివారం సంతాపదినంగా ప్రకటించింది. అధ్యక్షుడు జిన్ పింగ్ సహా ప్రజలంతా జాతీయ పతాకాన్ని అవగతనం చేసి చనిపోయిన వారికి నివాళులర్పించారు.

కరోనా కారణంగా ఆఫ్రికా దేశాలకు దిగుమతి నిలిచిపోయి ఆహార కొరత వాటిల్లుతోంది.

* భారత్ లో పెరుగుతున్న కేసులు.. 77మంది మృతి

భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల వెలుగుచూడడంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3374 కేసులు నమోదయ్యాయి. 77మంది ఇప్పటివరకు కరోనా కాటుకు మరణించారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలోనే 24మంది మరణించారు.

*తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ - ఏపీ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో కేసులు మరింత విజృంభిస్తున్నాయి. తాజాగా ఏపీలో 226 కరోనా కేసులు నమోదవ్వగా ఒక వ్యక్తి మరణించాడు. ఏపీలో శనివారం ఉదయానికి 164 కేసులు నమోదు కాగా.. రాత్రికి మరో 30 కేసులు పెరిగినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో ఒకరు - కృష్ణా జిల్లాలో మరొకరు ఏపీలో కరోనా కారణంగా మృతి చెందారు. వీరితో కలిపి ఏపీలో మరణాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3కు చేరింది.

ఇక తెలంగాణలో 272 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 34మంది కోలుకోగా.. 11మంది మృతిచెందారు.