Begin typing your search above and press return to search.

కరోనా.. ఈ వయసు వారికే ఎక్కువ!

By:  Tupaki Desk   |   5 April 2020 7:31 AM GMT
కరోనా.. ఈ వయసు వారికే ఎక్కువ!
X
ప్రస్తుతం కరోనా వైరస్‌ భారతదేశంలో విలయతాండవం చేస్తోంది. ఆ వైరస్‌ సోకిన వారు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అయితే భారతదేశంలో ఒక వయసు వారికి మాత్రమే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్‌ బారిన పడిన భారతీయుల్లో ఎక్కువ మంది 21 నుంచి 60 ఏళ్ల మధ్య వారేనని భారత ప్రభుత్వం వెల్లడించింది. మొదటిసారిగా కరోనా బాధితుల వయసు వివరాలను విడుదల చేసింది.

శనివారం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2,902 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. వారిలో 68 మంది మృతిచెందారని ప్రకటించింది. ఈ కేసుల్లో ఇప్పటివరకు కోలుకున్న వారు మొత్తం 184 మంది ఉన్నారు. అయితే వైరస్‌ సోకిన వారిలో వయసుల వారీగా వివరాలు వెల్లడించారు. 21- 40 వయసు మధ్య ఉన్న వారు 1,213 మంది ఉన్నారని - 41 నుంచి 60 ఏళ్ల మధ్య 951 మందికి సోకిందని - 60ఏళ్ల పైబడిన వారిలో 484 మంది ఉన్నారని వెల్లడించింది. ఈ వైరస్‌ సోకిన వారిలో ప్రస్తుతం దాదాపు 58 మంది పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో కేరళ - మధ్యప్రదేశ్‌ - ఢిల్లీకి చెందిన వారే అధికంగా ఉన్నారని తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు 2,902 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 68 మంది మృతిచెందారు. అయితే మృతుల్లో అధికంగా వృద్ధులు ఉన్నారు. ఆ మరణాలు సంభవించడానికి కారణం వృద్ధులు హై బీపీ - డయాబెటీస్‌ - కిడ్నీ - గుండె సంబంధ అనారోగ్య సమస్యలతో ఉండడంతో వారికి కరోనా సోకి వారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కరోనా వైరస్‌ వేగంగా వృద్ధులకు వ్యాప్తి చెంది వారు మృతి చెందుతున్నారని పేర్కొంటున్నారు.