Begin typing your search above and press return to search.

అమెరికా ఆధిపత్యం కోల్పోతుందా? చైనా అగ్రరాజ్యంగా మారబోతుందా?

By:  Tupaki Desk   |   27 March 2020 2:30 PM GMT
అమెరికా ఆధిపత్యం కోల్పోతుందా? చైనా అగ్రరాజ్యంగా మారబోతుందా?
X
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. ఈ కరోనా భారిన పడి ప్రపంచంలోని అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచం దేశాల పెద్దన్నగా పిలవబడే , అగ్రరాజ్యం అమెరికాని సైతం ఈ కరోనా వైరస్ వణికిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా భాదితులు ఎక్కువగా ఉన్న దేశం కూడా అమెరికానే. కరోనా భాదితుల సంఖ్యలో అమెరికాని చైనా దాటిపోయింది. అమెరికా లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ..పనిగట్టుకుని కరోనావైరస్‌ను పదేపదే చైనా వైరస్ అని పిలుస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఆ వైరస్‌ను 'వుహాన్ వైరస్' అని పిలుస్తున్నారు. దీనిని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైరస్ తొలుత మనుషులకు సోకటం మొదలైనపుడు నియంత్రించటంలో చైనా విఫలమైందని , చైనా వ్యవహార తీరుని ట్రంప్, పాంపేయో తప్పుపట్టారు. కానీ ఏం జరుగుతోందనే విషయంలో తాము పూర్తి పారదర్శకంగా లేమన్న వాదనను చైనా అధికార ప్రతినిధులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మరోవైపు, ఈ మహమ్మారికి కారణం అమెరికా సైన్యపు క్రిమి యుద్ధ కార్యక్రమం అంటూ చైనా సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి. అయితే.. ఈ వైరస్ నిర్మాణం పూర్తిగా సహజంగానే పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే , ఈ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా , అమెరికా మాటల యుద్ధం వెనుక ఎదో మర్మం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నెల మొదట్లో అమెరికా తన సరిహద్దులను ఇటలీ సహా యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించినపుడు.. ఇటలీకి తాము వైద్య బృందాలు, సరఫరాలను పంపిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీలో ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారిలా వ్యాపించి, ఇటలీని నాశనం చేస్తుంది . ఇరాన్ - సెర్బియాలకు కూడా చైనా సాయం పంపించింది. ఇది తెర వెనుక జరుగుతున్నసమాచార యుద్ధాలకు సంకేతం. ఈ సంక్షోభం నుంచి బయటపడి, అంతర్జాతీయ శక్తిగా తన హోదాను పునరుద్ధరించుకోవటానికి చైనా తాపత్రయపడుతోంది. ఇది.. అన్ని దేశాల పరిపాలన, రాజకీయ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరీక్షా సమయం. ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఇకపోతే , అమెరికా - చైనా సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిని ఉన్న సమయంలో ఈ మహమ్మారి పంజా విసిరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార ఉద్రిక్తతలను ఇటీవలి పాక్షిక వాణిజ్య ఒప్పందం పెద్దగా తగ్గించలేదు. ఆసియా-పసిఫిక్‌లో తలెత్తగల భవిష్యత్ సంఘర్షణ కోసం చైనా - అమెరికా రెండూ మళ్లీ బలాలు సమీకరించు కుంటున్నాయి. చైనా ఇప్పటికే -కనీసం ప్రాంతీయంగానైనా ఒక సైనిక సూపర్ పవర్‌ గా అవతరించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కోసం తనకు అవసరమైన మరింత విస్తృతమైన హోదా కోసం చైనా తహతహలాడుతోంది.

ఈ వైరస్‌ను జయించిన తర్వాత.. కుదేలైన ప్రపంచ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించటంలో చైనా ఆర్థిక పునరుద్ధానం కీలక పాత్ర పోషించబోతోంది. కానీ ఇప్పటికైతే.. కొత్త కరోనావైరస్ మీద పోరాడటానికి చైనాసాయం చాలా అవసరం. వైద్య సమాచారం - అనుభవాలను పంచుకోవటం కొనసాగించాల్సిన అవసరముంది. వైద్య పరికరాలు - మాస్కులు - ప్రొటెక్టివ్ సూట్లు వంటి వైద్య రక్షణ పరికరాలు కూడా చైనాలో భారీగా తయారవుతాయి. వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయటానికి ఇవి భారీ స్థాయిలో అవసరం. ఈ సంక్షోభం తీవ్రతను అంగీకరించటంలో ట్రంప్ ప్రభుత్వం తొలుత విఫలమైంది. అమెరికాకే ప్రాధాన్యం అనే తమ విధానానికి మరొక అవకాశంగా భావించింది. కానీ ఇప్పుడు ఆ దేశ ప్రపంచ నాయకత్వం ప్రమాదంలో పడింది.

ఒబామా ప్రభుత్వంలో తూర్పు ఆసియా - పసిఫిక్ వ్యవహారాలకు సహాయ విదేశాంగ మంత్రిగా పనిచేసిన కర్ట్ ఎం క్యాంప్‌ బెల్ - ఆసియా వ్యవహారాల నిపుణుడు రష్ దోషి ఇటీవల 'ఫారిన్ అఫైర్స్'లో ఒక వ్యాసం రాశారు. ''ప్రపంచ నాయకుడిగా గత ఏడు దశాబ్దాలుగా గల అమెరికా హోదాను కేవలం సంపద - శక్తితో మాత్రమే నిర్మించలేదు. అంతర్గత ప్రభుత్వ విశ్వసనీయత - అంతర్జాతీయంగా ప్రజల మేలుకు తోడ్పడటం, ఒక సంక్షోభానికి అంతర్జాతీయ ప్రతిస్పందనను కూడగట్టి సమన్వయం చేయటానికి సంసిద్ధత, చేయగల సామర్థ్యం కూడా దీనికి కారణం'' అని వారు అందులో రాసారు.

కరోనా పై అమెరికా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అయితే , ఈ వుహాన్ లో ఈ సంక్షోభం తలెత్తినపుడు చైనా ముందుగా స్పందించిన తీరు రహస్యంగా సాగింది. కానీ ఆ తర్వాత తన విస్తారమైన వనరులను సమర్థవంతంగా, మెప్పించేలా మోహరించింది. వైరస్ విజృంభణను మొదట తిరస్కరించటం, నిర్వహణ వైఫల్యాల పట్ల సామాజిక అశాంతి తలెత్తుతుందనే భయంతో చైనా ఇప్పుడు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ దూకుడుగా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. మహమ్మారి విషయంలో తన అమానుష వైఖరిని మరుగునపరచటం, ప్రపంచమంతటా విస్తరించటానికి దారితీయటంలో తన పాత్రను తక్కువచేసి చూపటం, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు - ముఖ్యంగా అమెరికా కృషి కన్నా తన కృషి మెరుగుగా ఉందని చాటటం ఈ ప్రచారం ఉద్దేశం'' అని పత్రికా స్వాతంత్ర్య సంస్థ 'పెన్ అమెరికా' సీఈఓ సుజాన్ నోసెల్ ఒక వ్యాసంలో తెలిపారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా స్థానం మీద ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఈ విదంగా ప్రపంచం పై అమెరికా ప్రభావం తగ్గించి .. చైనా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తుంది. ప్రస్తుతం చైనా అడుగులు కూడా అలాగే ఉన్నాయి. కరోనా ని నిర్ములించడానికి చైనా అన్ని దేశాలకి చేయూతని అందిస్తాం అంటూ ప్రకటిస్తుంది. కానీ , అమెరికా మాత్రం తమ దేశంలోనే ఈ కరోనా ని కట్టడి చేయలేకపోతోంది. ఇదే ధోరణి కొన్ని రోజులు కొనసాగితే ..అగ్రరాజ్యం అన్న పేరు అమెరికా నుండి తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది.