Begin typing your search above and press return to search.

స్పీకర్‌ పోచారంకి కరోనా పాజిటివ్ ..!

By:  Tupaki Desk   |   25 Nov 2021 6:31 AM GMT
స్పీకర్‌ పోచారంకి కరోనా పాజిటివ్ ..!
X
తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. సాధారణ పరీక్షల్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా టెస్టు చేయించుకున్నాని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రి లో చేరానని తెలిపారు.

గత కొన్నిరోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలతో హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే .. నాలుగు రోజుల క్రితమే ఆయన మనవరాలి పెళ్లి జరగ్గా, ఆ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన పోచారం.. అతిథులందరినీ ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేశారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డితో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ కొత్తగూడలోని వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌ లో ఆదివారం ఘనంగా వివాహం జరిగింది. స్పీకర్‌ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి తలెత్తింది.

కేసీఆర్‌ కు గతంలో కరోనా సోకగా, జగన్‌ కోవిడ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ సైతం ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.