Begin typing your search above and press return to search.

మోడీ రాష్ట్రంలో దారుణం.. కరోనా రోగులు సజీవదహనం

By:  Tupaki Desk   |   6 Aug 2020 7:10 AM GMT
మోడీ రాష్ట్రంలో దారుణం.. కరోనా రోగులు సజీవదహనం
X
ఘోరం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ప్రమాదం విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తీవ్రమైన విషాదం కమ్మేసేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. అహ్మదాబాద్ లోని కోవిడ్ 19 ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఉదంతంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో ఎనిమిది మంది ఆగ్నికి ఆహుతి అయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఐసీయూలో మంటలు చెలరేగటంతో.. ఎనిమిది మంది రోగులు మంటల్లో చిక్కుకుపోయారు. తీవ్రమైన అస్వస్థతతో ఉండటంతో వారు మంటల నుంచి తప్పించుకోలేకపోయినట్లు తెలుస్తోంది.

మరణించిన వారిలో ఐదుగురు పురుషులు.. ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా చెబుతున్నారు.ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఆసుపత్రిలోని మరో 40 మంది రోగుల్ని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఆగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. రంగంలోకిదిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి అదుపులో ఉందని.. అహ్మదాబాద్ నగర బి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఎల్బీ జాలా వెల్లడించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

కాగా.. ఈ ఘోరంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ ఉదతంపై తాను గుజరాత్ ముఖ్యమంత్రివిజయ్ రూపానీ.. ఆహ్మాదాబాద్ మేయర్ బిజాల్ పటేల్ తో మాట్లాడినట్లు చెప్పారు. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మరణించిన వారికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన వారికి రూ.50వేల సాయాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.