Begin typing your search above and press return to search.

కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోనే .. !

By:  Tupaki Desk   |   9 Jun 2021 10:30 AM GMT
కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోనే .. !
X
గత కొన్ని రోజులుగా మనుషులపై తన ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్‌ ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో తెలియడం లేదు. కానీ, ఆ వైరస్ సృష్టికర్త చైనానే అన్నది చాలా మంది అనుమానం. కరోనాపై చైనా ఎన్ని కథలు చెబుతున్నా.. అది కచ్చితంగా వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకయిందని అమెరికా ఒకే మాట పదే పదే చెప్తూనే ఉంది. దాని సంగతేమిటో తేల్చడానికి దర్యాప్తు సంఘాలను కూడా పనిలో పెట్టింది.. చైనా మాత్రం అమెరికా మీద నిందలు మోపుతోంది. అదలా ఉంచితే కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందన్నది ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అంటోంది. కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకయ్యిందని ఆ దేశానికి చెందిన ఓ పత్రిక అంటోంది.

దానికి తగిన ఆధారాలను చూపుతోంది. చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో పని చేసిన యుసెన్‌ జువూ అనే సైంటిస్టు 2020 ఫిబ్రవరి 24న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడట, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ ను మహమ్మారిగా ప్రకటించక ముందే జువూ వ్యాక్సిన్‌ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడన్నమాట. నిజానికి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గత ఏడాది మార్చి 11న కరోనా తీవ్రతను గుర్తించింది. ప్రపంచ దేశాలను అలెర్ట్‌ చేసింది. అంతకుముందే కరోనా వైరస్ వ్యాకిన్‌ పై పేటెంట్‌ కావాలంటూ యుసెన్‌ పీఎల్‌ ఏ తరఫున దరఖాస్తు చేశాడంటే ఆయనకు ఈ వైరస్‌ గురించి ముందే తెలిసుండాలని అర్థమవుతోంది.

కరోనా వైరస్‌ మనుషులకి సోకిందని చైనా ప్రకటించిన అయిదు వారాలకే జువూ వ్యాక్సిన్‌ పేటెంట్‌ కోసం ప్రయత్నించడం పలు అనుమానాలను కలిగిస్తోంది. అంటే వైరస్‌ ఎంత డేంజరో చైనాకు అప్పటికే తెలిసి ఉండాలి. యుసెన్‌ జువూ ఎవరో కాదు.. వూహాన్‌ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై పరిశోధనలు చేస్తూ బ్యాట్‌ వుమెన్‌ గా ప్రసిద్ధురాలైన ఆ ల్యాబ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ షి జెంగ్లీతో కలిసి పని చేసిన వ్యక్తి.. అందుకే కరోనా వైరస్‌ ఆనుపానాలన్నీ ఆయనకు తెలుసు. కరోనా వైరస్‌ చైనా నుంచే పుట్టిందనడానికి ఇంతకు మించిన రుజువలు అక్కర్లేదంటోంది ఆస్ట్రేలియా పత్రిక. ఇప్పుడాయన బతికి ఉంటే నిజాలు బయటకు వచ్చేవి..వ్యాక్సిన్‌ పేటెంట్‌ కోసం అప్లై చేసుకున్న మూడు నెలల్లోనే ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. అంత గొప్ప సైంటిస్టు చనిపోయినా చైనాలో చడిచప్పుడు లేదు. కేవలం ఓ మీడియాలోనే ఈ వార్త వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుంది.. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన న్యూ యార్క్‌ టైమ్స్‌ పత్రిక బయటపెట్టింది. అన్నట్టు యుసెన్‌ జువూ అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, న్యూయార్క్‌ బ్లడ్‌ సెంటర్‌లలో కూడా పని చేశారట.