Begin typing your search above and press return to search.

వేడి నీటితో కరోనా ఖతం.. నిజమెంత?

By:  Tupaki Desk   |   9 May 2021 11:30 PM GMT
వేడి నీటితో కరోనా ఖతం.. నిజమెంత?
X
కరోనా రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వంటింటి చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు పెరిగిపోయాయి. సోషల్​ మీడియాలో కరోనా వచ్చిందా? అయితే ఇలా చేయండి? అంటూ ప్రతిరోజు పోస్టులు దర్శనమిస్తున్నాయి. కొందరైతే వేడి నీటితో కరోనా అంతమైపోతుందని.. ప్రతి ఒక్కరూ ఆవిరి పట్టుకుంటే కరోనాను తరిమికొట్టవచ్చని పోస్టులు తయారుచేస్తున్నారు. దీంతో ప్రజలంతా వేలం వెర్రిగా ఈ రెమిడీస్​ ఫాలో అవుతున్నారు.

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.. ఒకవేళ పాజిటివ్​ అని నిర్ధారణ అయితే వెంటనే ఐసోలేషన్​కు వెళ్లిపోయి డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోవడం లేదు. ఒకవేళ కరోనా పరీక్ష కోసం వెళితే వ్యాధి సోకుతుందని భయపడుతున్నారు. దీనికి తోడు ఇంట్లోనే తమకు తెలిసిన వైద్యం చేసుకుంటున్నారు.

అయితే వేడినీటితో స్నానం చేస్తే.. ఆవిరి పడితే కరోనా రాదని ఇటీవల ప్రచారం జోరందుకున్నది. ఈ ప్రచారం నిజం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేడినీటితో ఆవిరిపట్టుకుంటే మంచిదే కానీ.. అంత మాత్రం చేత కరోనా వైరస్​ చనిపోతుందని చెప్పలేమని .. ఇది దుష్ప్రచారం అని కేంద్రం తెలిపింది.

ఈ విషయంపై గుజరాత్‌లోని సూరత్‌లోని జోగి ఆయుర్వేద్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు నీలేష్ జోగల్ మాట్లాడుతూ.. రోజుకు రెండుసార్లు సాధారణ ఆవిరి పీల్చితే మంచిదే కానీ.. కేవలం ఆ ఒక్కపని ద్వారా కరోనా పోతుందని చెప్పలేం. డాక్టర్లు చెప్పిన మందులు వాడాలి. పరీక్షలు కూడా చేయించుకోవాలి.

ప్రతిరోజు 30 నిమిషాలు యోగాసన, ప్రాణాయామం, ధ్యానం చేయాలని కొందరు సూచిస్తున్నారు. అంతేకాక కొన్ని రకాల కషాయాలు కూడా తయారుచేసుకొని వాడుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. అయితే వీటి వల్ల కేవలం దగ్గు, జలుబు నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది తప్ప.. కరోనా వైరస్​ అంతమవుతుందని చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు.