Begin typing your search above and press return to search.

జగన్, కేసీఆర్ ల ఇమేజ్ ను మార్చేసిన కరోనా

By:  Tupaki Desk   |   14 July 2020 7:30 AM GMT
జగన్, కేసీఆర్ ల ఇమేజ్ ను మార్చేసిన కరోనా
X
అది కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి ప్రబలుతున్న రోజులు.. దేశంలో లాక్ డౌన్ విధించారు. సహజంగానే ప్రజలకు, ప్రెస్ మీట్లకు కాస్త దూరంగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్.. తన సహజశైలికి భిన్నంగా రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ.. కరోనా నియంత్రణ చర్యలు వివరిస్తూ ఆకట్టుకున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుందంటే తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయి చెవులు నిక్కబొడుచుకొని వింటూ కేసీఆర్ ప్రసంగానికి ముగ్ధులైన పరిస్థితిని చూశాం.. అదే ఏపీ సీఎం జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్లలో కేసీఆర్ అంత అనర్గళంగా మాట్లాడకపోయినా చర్యలు అయితే చేపట్టారు. కానీ మూడు నెలలు గడిచాయి.. ట్రెయిన్ రివర్స్ అయ్యింది.. ఇప్పుడు మాటల మాంత్రికుడు కేసీఆర్ వెనకబడిపోగా.. సైలెంట్ గా ఉన్న జగనే గ్రేట్ అనిపించుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది..?

తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ ల పరిస్థితిని కరోనా పూర్తిగా మార్చేసింది. అవును కట్టడిలో మొదట్లో కింగ్ లా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చేతులెత్తేశాడని స్వయంగా గవర్నర్ నుంచి ప్రతిపక్షాల వరకు ఆడిపోసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీలో జగన్ కరోనాను కంట్రోల్ చేస్తున్నట్టు మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. దీన్ని బట్టి మూడు నెలల్లో కేసీఆర్, జగన్ ల పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సైలెంట్ గా పనిచేసుకుపోయిన జగన్ కరోనా కట్టడిలో ముందుంజలో నిలవగా.. కరోనాపై చేతులెత్తేసిన కేసీఆర్ విమర్శల పాలవుతున్నారు.

తాజాగా ఇదే విషయంపై మా ‘‘తుపాకీ.కామ్’’ పోల్ నిర్వహించింది. ‘కరోనా కట్టడిలో సీఎం జగన్, కేసీఆర్ లలో ఎవరు బాగా పనిచేస్తున్నారు’ అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఆశ్చర్యం.. జనాభిప్రాయం కూడా ఒకటే.. మొదట్లో సందడి చేసి ఇప్పుడు కరోనా అరికట్టడంలో.. కనీసం చర్యలు చేపట్టకుండా.. ప్రెస్ మీట్లకు రాకుండా అజ్ఞాతవాసంలో ఉంటున్న కేసీఆర్ విఫలమయ్యారని ప్రజలు అంటున్నారు. కరోనాపై జగన్ మాత్రం చురుకుగా స్పందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు.

మా ‘తుపాకీ.కామ్’ పోల్ లో కరోనా కట్టడిలో సీఎం జగన్ బాగా పనిచేస్తున్నారని 72.51శాతం మంది పాఠకులు తీర్పునిచ్చారు. ఇక కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని అన్నవారు కేవలం 11.47శాతం మంది మాత్రమే. ఇక డోలాయమానంలో ‘ఏమో చెప్పలేం’ అంటూ 16.02శాతం మంది ఈ ఓటింగ్ పై సమాధానం దాటవేశారు.

దీన్ని బట్టి కరోనా కట్టడిలో కేసీఆర్ కంటే జగన్ బాగా పనిచేస్తున్నారని పాఠకులు అభిప్రాయం వెలిబుచ్చారు. మరి ఇప్పటికైనా.. ఇన్ని విమర్శలు వచ్చాకైనా కేసీఆర్ జర ఆ మహమ్మారిపై దృష్టిసారిస్తే బెటర్ అని ప్రజాభిప్రాయమే స్పష్టం చేస్తోంది.