Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ముప్పు మన పిల్లలకి పెద్దగా ఉండదట .. ఎవరు చెప్పారంటే ?

By:  Tupaki Desk   |   18 Jun 2021 5:30 PM GMT
థర్డ్ వేవ్ ముప్పు మన పిల్లలకి పెద్దగా ఉండదట .. ఎవరు చెప్పారంటే ?
X
మనదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ విజృంభణ పీక్స్ కి చేరి , ఇప్పుడిప్పుడే మళ్లీ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉంది అని చెప్పడం , అలాగే ఈ థర్డ్ వేవ్ లో ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది అని చెప్పడంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. అయితే , పిల్లలపై కరోనా మూడో వేవ్‌ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్‌ ఫెక్షన్‌ సోకిన రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉన్న కారణంగా కరోనా మూడో వేవ్‌ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం ప్రాథమికంగా తేల్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కలిసి ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో వేవ్‌ ముప్పు అధికంగా ఉంటుందని ఆందోళనకర వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం లో ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు కొంత ఉపశమనాన్ని కల్గిస్తాయి. ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్‌ తో శరీరంలో కోవిడ్‌ యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్‌ లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటివిటీగా చెప్తారు. ఈ అధ్యయనానికి ఎయిమ్స్‌ ఎథిక్స్‌ కమిటీ ఆమోదం లభించింది. డేటా అందుబాటులో ఉన్న 4,509 మంది వలంటీర్లలో 700 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కాగా, మిగతా వారు 18 ఏళ్ల వయసువారు. వారి సగటు వయసు ఢిల్లీ (అర్బన్‌)లో 11, ఢిల్లీ (రూరల్‌) లో 12, భువనేశ్వర్‌ (ఒడిశా)లో 11, గోరఖ్‌పూర్‌ (యూపీ)లో 13, అగర్తల (త్రిపుర)లో 14గా ఉంది. వీరి నుంచి ఈ సంవత్సరం మార్చ్‌ 15 నుంచి జూన్‌ 10వ తేదీ మధ్య వివరాలు సేకరించారు. పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ప్రస్తుతమున్న వేరియంట్ల ద్వారా వచ్చే మూడో వేవ్‌ రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువ అని ఆ అధ్యయనం తేల్చేసింది.

ఈ అధ్యయనం లో ప్రాథమికంగా నిర్ధారించిన ముఖ్యాంశాలని ఒకసారి చూస్తే .. సీరో ప్రివలెన్స్‌ 18 ఏళ్లలోపు వయసు వారిలో 55.7%, 18 ఏళ్లపైన వయసున్న వారిలో 63.5%గా ఉంది. ఈ విషయంలో పెద్దలు, పిల్లల్లో తేడా ఎక్కువగా లేదు.కరోనా సోకిన సమయంలో 50.9 శాతం పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. సెకండ్ వేవ్‌ ముందు దక్షిణ ఢిల్లీలో జనసాంద్రత అధికంగా ఉన్న ఒక కాలనీలో సీరో ప్రివలెన్స్‌ రేటు 74.7%. అలాగే ఫరీదాబాద్‌ ప్రాంతంలోని పిల్లల్లో ఆ రేటు 59.3%. రెండో వేవ్‌ తరువాత ఆ ప్రాంతాల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశముంది. గ్రామీణ జిల్లా అయిన గోరఖ్‌ పూర్‌ లో సీరో ప్రివలెన్స్‌ రేటు 87.9 శాతంగా ఉంది. సర్వే చేసిన గ్రామీణ ప్రాంత జనాభాలో సగానికి పైగా ఇప్పటికే వైరస్‌ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా 2020 ఆగస్ట్‌లో కూడా సీరో ప్రివలెన్స్‌ సర్వే జరిపారు. అప్పుడు 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3,021 మంది పిల్లల్లో పాజిటివిటీ రేటు 9 శాతమే కాగా, ప్రస్తుత సర్వేలో అది 60.3% కావడం గమనార్హం.