Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా కల్లోలం..న్యూయార్క్ గవర్నర్ తమ్ముడికి పాజిటివ్

By:  Tupaki Desk   |   2 April 2020 5:00 PM GMT
అమెరికాలో కరోనా కల్లోలం..న్యూయార్క్ గవర్నర్ తమ్ముడికి పాజిటివ్
X
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రత్యేకించి ఆ దేశానికి వాణిజ్య రాజధాని గా విరసిల్లుతున్న న్యూయార్క్ నగరాన్ని కరోనా దాదాపుగా కమ్మేసింది. అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో... ఒక్క న్యూయార్క్ నగరంలో నమోదైన కేసులే అత్యధికం అని చెప్పాలి. ఇక కరోనా కారణంగా ఆ దేశంలో నమోదైన మరణాల్లోనూ న్యూయార్క్ లో నమోదైన మరణాలే అధికమట. మొత్తంగా అమెరికాను భయపెడుతున్న కరోనా... న్యూయార్క్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పాలి. దీనికి నిలువెత్తు నిదర్శనంగా న్యూయార్క్ గవర్నర్ సోదరుడికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్లడించారు.

సీఎన్‌ఎన్‌ టీవీ న్యూస్‌ యాంకర్‌ గా పని చేస్తున్న తన సోదరుడు క్రిస్‌ క్యూమో కరోనా బారిన పడ్డాడని న్యూయార్క్‌ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. ప్రాణాంతక వైరస్‌ గా మారిన కరోనా ఎవరికైనా సోకుతుందని.. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా క్యూమో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. "నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా. తనను తాను కూడా కాపాడుకోలేడు. ఇది చాలా భయంకరంగా ఉంది. తన పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మనం ప్రేమించే వాళ్లకు ఇలా జరిగితే అందరం ఇలాగే విచారిస్తాం కదా. తమ్ముడు ఐ లవ్‌ యూ. ధైర్యంగా ఉండు" అని ఆండ్రూ ఉద్వేగభరిత ట్వీట్‌ చేశారు.

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ అంటువ్యాధి కారణంగా బుధవారం ఒక్కరోజే 884 మంది మృతిచెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి దెబ్బకు ఇప్పటికే వెయ్యికి పైగా న్యూయార్క్‌ పౌరులను కోల్పోయామని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌ పరిస్థితి బాగా లేదని.. వైద్య సిబ్బంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు 80 వేల మంది రిటైర్డు డాక్టర్లు, నర్సులు ఆపత్కాలంలో మద్దతుగా నిలిచేందుకు ముందకు వచ్చారు.