Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోన్నా..టెన్షన్ పెరుగుతుందే?

By:  Tupaki Desk   |   5 April 2020 6:31 AM GMT
కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోన్నా..టెన్షన్ పెరుగుతుందే?
X
కరోనా లాంటి పరిస్థితుల్లో అంచనాలకు తగ్గట్లుగా పరిణామాలు చోటు చేసుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఏ రోజు ఏం జరుగుతుందన్నది ముందే అంచనా వేయటం.. అందుకు తగ్గట్లే జరగటం బాగున్నా.. అలాంటి పరిస్థితికి ఏ మాత్రం హ్యాపీగా లేని పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారిన పడిన వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పినట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపించిన వారందరికి పెద్ద ఎత్తున వైద్యసేవలు అందిస్తున్నామని.. వారంతా వైద్యానికి స్పందిస్తున్నట్లు గతంలోనే చెప్పారు.

తన అంచనాల ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో పెద్ద ఎత్తున డిశ్చార్జిలు ఉంటాయని చెప్పటం తెలిసిందే. దీనికి అనుగుణంగా శనివారం ఒక్కరోజున గాంధీ ఆసుపత్రి నుంచి పదిహేను మంది బాధితుల్ని డిశ్చార్జ్ చేశారు. దీంతో.. గాంధీ నుంచి పందొమ్మిది మందిని డిశ్చార్జి చేసినట్లుగా చెప్పాలి. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో సంతోష పడే పరిస్థితి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఆనందమే లేకుండా పోతోంది.

మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో ప్రభుత్వం అంచనాలు దారుణంగా దెబ్బ తినటమే కాదు.. కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితి ఎంతలా ఉందంటే.. ఒక్క గాంధీలోనే 464 మందిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వారి నమూనాల్ని పరీక్షల కోసం పంపారు. వారి ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 83 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కేసులు తగ్గి.. బాధితులు దశల వారీగా డిశ్చార్జ్ అవుతారన్న సీఎం కేసీఆర్ అంచనా వాస్తవరూపం దాల్చినప్పటికీ.. మర్కజ్ కారణంగా బాధితుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. దీంతో.. ముందే అనుకున్నట్లు జరుగుతున్నా.. ఏ మాత్రం సంతోషం లేని పరిస్థితి తాజాగా నెలకొందని చెప్పక తప్పదు.