Begin typing your search above and press return to search.

వేరియంట్ల పంజా.. చిన్నారులు జాగ్రత్త..!

By:  Tupaki Desk   |   18 Jan 2022 11:30 PM GMT
వేరియంట్ల పంజా.. చిన్నారులు జాగ్రత్త..!
X
కరోనా మహమ్మారి దశలవారీగా విజృంభిస్తోంది. వివిధ వేరియంట్ల రూపంలో పంజా విసురుతోంది. మరోవైపు వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే వీలైనంత త్వరగా పిల్లలకు కూడా టీకా ఇవ్వాలని డాక్టర్ వినితా బాల్ సూచించారు. పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు చెందిన ప్రొఫెసర్ వినీతా... థర్డ్ వేవ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 18ఏళ్ల లోపు వారికి టీకా చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పిల్లలకు రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చెప్పారు. వారికి పరీక్షలు చేస్తేనే ఏ రకమైన వేరియంట్ సోకిందో క్లియర్ గా తెలుస్తుందని అన్నారు. అలా తెలిస్తేనే అందుకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వగలరని పేర్కొన్నారు.

దేశంలో ప్రతీఒక్కరికీ కరోనా పరీక్ష చేయాలని వినీతా అన్నారు. అందరిలో రోగ నిర్ధారణ చేస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చునని తెలిపారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలు మనదేశంలో ఉన్నాయన్నారు. ఎవరికైనా వైరస్ సోకితే వెంటనే వారిని ఐసోలేట్ చేసి చికిత్స అందించవచ్చునని చెప్పారు. ఇలా రోగ నిర్ధారణ, ఇమ్యునైజేషన్ పవర్ ను అంచనా వేయవచ్చునని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల వేరియంట్ల ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక థర్డ్ వేవ్ ప్రారంభమైందని వినితా వెల్లడించారు. రోజుకు రెండున్నర లక్షల కేసులకు పైగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. భారత్ లో 24 గంటల్లో నాలుగు లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

దిల్లీ, ముంబయి, కలకత్తా వంటి నగరాల్లో కరోనా విజృంభించే అవకాశం ఎక్కువంగా ఉందని తెలిపారు. అయితే ఇప్పటికే చాలామంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. దీనివల్ల ఆస్పత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ లక్షణాలతో అతి త్వరగా నయం అవుతుందని చెప్పారు. ఎక్కువ మందికి వైరస్ సోకినా కూడా ఆందోళన అక్కరలేదని అన్నారు. అయితే కరోనాను ఆర్టీపీసీఆర్ పరీక్షతో కచ్చితంగా గుర్తించవచ్చునని వెల్లడించారు. ఇంట్లో పరీక్షించుకునే కిట్లు, ఇతర పరీక్షల్లో అంత కచ్చితత్వం ఉండదని చెప్పారు. అయితే ఇంట్లో కరోనా పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వానికి చెప్పాలని అన్నారు. అలా అయితేనే రిపోర్టుల గణాంకాలు కచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల నమోదవుతున్న 90 శాతం కేసులు కొత్త వేరియంట్ కు చెందినవనే అధికారులు చెబుతున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రూపంలో వైరస్ విరుచుకుపడుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం చాలా అవసరమని వినితా చెబుతున్నారు. రెండు డోసుల టీకా తీసుకుంటే బేషుగ్గా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇకపోతే వీలైనంత త్వరగా పిల్లలకు టీకా ఇవ్వాలని అంటున్నారు. టీకా వచ్చేదాకా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.