Begin typing your search above and press return to search.

మోడీని.. అక్క‌డే అప్పుడే.. చంపేయాల‌నుకున్నారు.. తీవ్ర‌ సంచ‌ల‌నం!!

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:33 AM GMT
మోడీని.. అక్క‌డే అప్పుడే.. చంపేయాల‌నుకున్నారు.. తీవ్ర‌ సంచ‌ల‌నం!!
X
బీహార్ రాష్ట్రంలోని పాట్న నగర పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది జులై నెలలో ప్రధాని మోడీ పాట్నా పర్యటన సందర్భంగా పీఎఫ్ఐ సభ్యులు దాడికి విఫలయత్నం చేశారని దర్యాప్తులో తేలింది.

ప్రధానిపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలువురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. ఎన్ఐఏ, ఈడీలు దేశవ్యాప్తం గా 15 రాష్ట్రాల్లో సోదాలు జరిపి 100 మందిని అరెస్ట్ చేసింది. ఈ ఏడాది జులై 12న పాట్నాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా పీఎఫ్ఐ నేతలు షఫీక్ పైత్ ప్ర‌ధాని మోడీ హత్యకు పథకం రూపొందించారని ఎన్ ఐఏ పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో గత కొన్నేళ్లుగా పీఎఫ్ఐ, సంబంధిత సంస్థల ఖాతాల్లో రూ.120 కోట్లకు పైగా జమ అయినట్లు తేలింది.

మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో పీఎఫ్ఐ సభ్యులు హత్రాస్‌కు వెళ్లారని దర్యాప్తులో వెల్లడైన‌ట్టు పేర్కొంది. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్రవాద ముఠా ఏర్పాటుకు ప్లాన్ చేయడం, మారణా యుధాలు, పేలుడు పదార్థాల సేకరణ, సున్నితమైన ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేయడంలో పీఎఫ్ఐ తన సభ్యుల ద్వారా పాలుపంచుకున్నట్లు ఆధారాలు కూడా కేంద్ర ఏజెన్సీలకు అందాయి.

మరో కేసులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆటంకాలు కలిగించాలనే ఉద్ధేశంతో పీఎఫ్ఐ సభ్యులు శిక్షణ పొందారని ఎన్ఐఏకు ఆధారాలు లభించాయి. దీంతో పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేంద్ర సంస్థలతో నిఘా వేయడంతో పాటు ఆ సంస్థను నిషేధించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు ఎన్ ఐఏ వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.