Begin typing your search above and press return to search.

నిన్నటి వరకు పైనాపిల్..నేడు సీతాఫలం..చైనా, తైవాన్ మధ్య వివాదం

By:  Tupaki Desk   |   23 Sep 2021 9:31 AM GMT
నిన్నటి వరకు పైనాపిల్..నేడు సీతాఫలం..చైనా, తైవాన్ మధ్య వివాదం
X
తైవాన్ నుంచి వచ్చే రెండు రకాల పండ్లను దిగుమతి చేసుకునేది లేదని చైనా కొన్ని రోజుల కిందట వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తైవాన్ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ వరకు తీసుకెళ్తామని చెబుతోంది. ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయంటూ తైవాన్ నుంచి సీతాఫలం, వాక్స్ ఆఫిల్ దిగుమతులు ఆపివేస్తామని చైనా బెదిరించింది. ఆ పండ్లలోని క్రిముల వల్ల తమ దేశంలో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.

తైవాన్ నుంచి దిగుమతి అవుతున్న సీతాఫలాల్లో ప్లానోకోకస్ మైనర్ అనే తెగులును తరచుగా గుర్తించినట్లు చైనా కస్టమ్స్ విభాగం చెబుతోంది. దీంతో ఈ రెండు పండ్ల దిగుమతులు అడ్డుకోవాలని, అది గ్వాంగ్‌డాంగ్ శాఖకు సంబంధించిన అన్ని బ్రాంచీల కస్టమ్స్ విభాగాలను ఆదేశించింది. ఎలాంటి శాస్త్రీయ కారణాలు వెల్లడించకుండానే, చైనా ఏకపక్షంగా వాదిస్తోందని తైవాన్ వ్యవసాయ మంత్రి చెన్ చీ చుంగ్ అన్నారు. చైనా నిర్ణయాన్ని కూడా ఆయన విమర్శించారు. మేం దీన్ని అంగీకరించం. సెప్టెంబర్ 30లోపు ప్రస్తుత సమస్యకు పరిష్కారం కనుగొనాలనే మా అభ్యర్థనకు సమాధానం ఇవ్వకపోతే, ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గరికి తీసుకెళ్తాం అని ఆయన చైనాను హెచ్చరించారు.

చైనా నిర్ణయంతో ప్రభావితం అవుతున్న రైతులకు సాయంగా తమ ప్రభుత్వం 100 మిలియన్ తైపే డాలర్లు (రూ.26.54 కోట్లకు పైనే) ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. చైనా ఇదే ఏడాది ఫిబ్రవరిలో హానికారక క్రిములు ఉన్నాయనే కారణం చూపుతూ తైవాన్ పైనాపిల్ దిగుమతులపై నిషేధం విధించింది. అది తమ దేశంపై ఒత్తిడి పెంచడానికి చైనా పన్నిన వ్యూహం అని తైవాన్ అంటోంది.పైనాపిల్‌ మీద చైనా ఆంక్షలు విధించడంతో తైవాన్ తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పైనాపిల్‌ ను వీలైనంత ఎక్కువగా తినాలని తమ దేశ పౌరులకు అపీల్ చేశారు.

దీనిపై ఒక ట్వీట్ చేసిన తైవాన్ ఉపాధ్యక్షుడు చింగ్-తె తన ట్వీట్‌ లో తైవాన్ పైనాపిల్ ఫైటర్ జెట్ కంటే బలమైనదని రాశారు. భౌగోళిక రాజకీయ ఒత్తిడిలు దాని రుచిని పాడు చేయలేవన్నారు.తైవాన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వివరాల ప్రకారం దేశంలో ప్రతి ఏటా నాలుగు లక్షల 20 వేల టన్నుల పైనాపిల్ ఉత్పత్తి అవుతుంది. అందులో 10 శాతం చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తారు. అందులో ఎక్కువ భాగం చైనాకు పంపిస్తారు. చైనా ఆంక్షలతో దేశంలో ఈ ఏడాది పైనాపిల్ ధర పడిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అయ్యాయి.

తైవాన్ ఒక దేశం కాదు, అది చైనాలోని ప్రాంతమే అని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం దశాబ్దాల నుంచి చెబుతోంది. అటు తైవాన్ మాత్రం ఆ వాదనలను కొట్టిపారేస్తూ వస్తోంది. చైనా అంతర్యుద్ధంలో మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులు చియాంగ్ కాయి షేక్ నేతృత్వంలో జాతీయవాద కామింగ్‌ తాంగ్ పార్టీని 1949లో ఓడించారు. ఆ తర్వాత కామింగ్‌ తాంగ్ తైవాన్‌ కు వెళ్లి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత అది తైవాన్ నియంత్రణను కామింగ్‌ తాంగ్‌ కు అప్పగించింది. కానీ, కామింగ్‌ తాంగ్ అక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జపాన్ తైవాన్‌ ను ఎవరికివ్వాలి అనే వివాదం తలెత్తింది. తైవాన్ ఒక ద్వీపం. అది 1950 నుంచే స్వతంత్రంగా ఉంది. కానీ, చైనా దానిని తమ తిరుగుబాటు దేశంగా భావిస్తుంది.