Begin typing your search above and press return to search.

బకాయి పంచాయతీ.. ఏపీ పరువు బజారుపాలు!

By:  Tupaki Desk   |   17 Feb 2020 7:45 AM GMT
బకాయి పంచాయతీ.. ఏపీ పరువు బజారుపాలు!
X
ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏకంగా అంతర్జాతీయ సంస్థలు తమకు నష్టం వాటిల్లుతున్నాయని, వేధిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నాయి. దీంతో రాష్ట్రం పరువు, ప్రతిష్ట మంటగలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలవుతోంది. తమ సేవలకు డబ్బులు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందంటూ విదేశీ కంపెనీలు తమ దేశంలోని రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతగా పరువుపోయేలా జరిగిన పరిణామం ఏమంటే..

రాష్ట్రానికి వరప్రదాయినిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా దాదాపు 150 మీటర్ల లోతులో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించడానికి ప్రపంచంలో మూడు కంపెనీలకే సామర్థ్యం ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లు గుర్తించి వాటిలో జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ సలహాతో బావర్‌ కంపెనీ, ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం చేసుకున్నాయి.

డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించేందుకు అవి ట్రాన్స్‌స్ట్రాయ్‌తో సబ్‌ కాంట్రాక్టు చేసుకున్నాయి. అయితే ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం ట్రాన్స్‌స్ట్రాయ్‌కు బిల్లులు చెల్లిస్తుండగా అవి సకాలంలో బావర్‌ కంపెనీకి చేరడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఆ కంపెనీ ఫిర్యాదు చేసింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపివేస్తామని ఆ కంపెనీ హెచ్చరించింది. దీంతో జలవనరులశాఖ ప్రత్యేకంగా ఎస్ర్కో అకౌంట్‌ను తెరిచి, నేరుగా సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.422 కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం చేసుకోగా సకాలంలో పనులు పూర్తి చేసిన బావర్ కంపెనీకి ప్రభుత్వం ఇంకా రూ.91.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీనిపై కంపెనీ ప్రతినిధులు పలుమార్లు జల వనరుల శాఖకు విన్నవించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

చంద్రబాబు హయాంలో జరిగిన ఈ నిర్ణయాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిపై సమీక్షించింది. పాత కాంట్రాక్టు సంస్థలు అధిక మొత్తాలకు పనులు చేపట్టాయని, దీనిలో అవినీతి, అక్రమాలు జరిగాయని నిర్ధారించి వెంటనే ప్రభుత్వం విచారణ కోసం కమిటీలు వేసింది. ఆ తర్వాత విచారణ చేపట్టడంతో బావర్‌ యాజమాన్యం ఆందోళనకు గురైంది. దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదంటూ జర్మనీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది.

ఢిల్లీలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) కార్యాలయానికి జర్మనీ రాయబారి వెళ్లి ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి చేస్తే ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వం మండిపడినట్టు సమాచారం. అంతర్జాతీయ కంపెనీల సేవలు వినియోగించుకున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తే ఎలాగని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ఆ కంపెనీలకు బకాయిలు చెల్లించాలని లేఖలు రాసినట్టు తెలుస్తోంది.

మరో కంపెనీ కూడా
ఇదే పరిస్థితి మరో కంపెనీకి కూడా ఎదురైంది. మెడ్‌టెక్‌ సిటీలో ఎలక్ట్రోమాగ్నటిక్‌ ఇంటర్‌ఫియరెన్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ, బయోమెడికల్‌ టెస్టింగ్‌ సేవలకు జర్మన్‌ కంపెనీ టీయూవీ రీయిన్‌లాండ్‌తో 2017 జూన్‌ 16వ తేదీన రూ.86.85 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిలో ఇంకా ఆ కంపెనీకి ప్రభుత్వం రూ.29.41కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోగా పనులు చేయకుండా తాత్కాలికంగా కంపెనీని సస్పెండ్‌ చేసింది. దీంతో టీయూవీ రీయిన్‌లాండ్‌ జర్మనీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ అంశంపైన కూడా డీపీఐఐటీ స్పందించి జర్మనీ రాయబారితో మాట్లాడారు. ఈ బకాయిలు కూడా చెల్లించాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ భార్గవ, ఏపీ భవన్‌ ఆర్సీ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు లేఖ రాశారు. దీనిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కావడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అంతర్జాతీయ సంస్థలతో దేశం పరువు పోతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వానికి వెంటనే బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ తదితర నిర్ణయాలతో ఇంతకుముందు పనులు దక్కించుకున్న సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు గగ్గోలు పెడుతున్నాయి. ఆ క్రమంలోనే ఆ రెండు కంపెనీలు కేంద్రం వద్దకు వెళ్లాయి.

అయితే ఈ పంచాయతీ పని అప్పటి సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పనేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాయిటర్స్ సంస్థతో కియా సంస్థ తరలిపోతుందని దుష్ర్పచారం చేయగా అది బెడిసి కొట్టింది. ప్రస్తుతం ఈ బకాయిల పంచాయతీ పై కూడా చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని తెలుస్తోంది. ఎటు తిరిగి జగన్ ను ఇబ్బందుల పాలు చేయాలని పన్నాగం పన్నుతున్నారని సమాచారం.
--