Begin typing your search above and press return to search.

దేశంలో ‘బొగ్గు’ దొంగలు పడ్డారు..

By:  Tupaki Desk   |   21 May 2022 5:30 AM GMT
దేశంలో ‘బొగ్గు’ దొంగలు పడ్డారు..
X
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు బొగ్గును తవ్వి అక్రమంగా తరలించుకుపోయారు. ఈ వీడియో గురువారం వైరల్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బిలాస్‌పూర్ రేంజ్) రతన్‌లాల్ డాంగి విచారణకు ఆదేశించారు.

వీడియోలో వందలాది మంది పురుషులు -మహిళలు బొగ్గును తవ్వే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు పారలు, ఇతర సాధనాలతో తవ్వడం, మరికొందరు బస్తాలలో బొగ్గును లోడ్ చేయడం వంటివి కనిపించాయి. గోనె సంచులను భుజాలపై వేసుకుని బారులు తీరిన జనం కూడా కనిపించారు. వైరల్ వీడియోపై విచారణ జరిపేందుకు బిలాస్‌పూర్‌లోని యాంటీ క్రైమ్ అండ్ సైబర్ యూనిట్ (ఏసీసీయూ) ఇన్‌ఛార్జ్‌ని దర్యాప్తు అధికారిగా నియమించినట్లు ఐజీ డాంగి తన ఉత్తర్వుల్లో తెలిపారు.

ఎస్.ఈసీఎల్ అనేది పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ. గతంలో బొగ్గు చోరీపై ఎస్‌ఈసీఎల్‌ అధికారులు దాఖలు చేసిన పోలీసు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. అక్రమ బొగ్గు మైనింగ్ రాకెట్‌లో ఎవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని ఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కోర్బా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) భోజ్‌రామ్ పటేల్ పరిపాలనా కారణాలను చూపుతూ గురువారం డిప్కా పోలీస్ స్టేషన్.. హార్దిబజార్ పోలీస్ చౌకీ (అవుట్ పోస్ట్) స్టేషన్ హౌస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ అవినాష్ సింగ్, డిప్కా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు హార్దిబజార్ చౌకీ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అభయ్ సింగ్ బైస్‌లను తక్షణమే బదిలీ చేస్తూ పోలీస్ లైన్ కోర్బాకు అటాచ్ చేసినట్లు బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వైరల్ వీడియో కోర్బాలోని ఎస్ఈసీఎల్ చెందిన గెవ్రా మరియు దిప్కా బొగ్గు గనులది అని తెలిసింది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎస్ఈసీఎల్ (బిలాస్‌పూర్ ప్రధాన కార్యాలయం) సనీష్ చంద్ర మాట్లాడుతూ ఎస్ఈసీఎల్ మైనింగ్ ప్రాంతంలో బొగ్గు దొంగతనం వెలుగులోకి వచ్చినప్పుడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ బొగ్గు దొంగతనం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.