Begin typing your search above and press return to search.

తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి .. ప్రధానికి సీఎం జగన్ అభ్యర్థన

By:  Tupaki Desk   |   24 Nov 2021 8:30 AM GMT
తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి .. ప్రధానికి సీఎం జగన్ అభ్యర్థన
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. దీనితో ఏపీని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఆయన తాజాగా లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని ఆయన గుర్తు చేశారు. రెండు హెలికాప్టర్లు, 17 ఎన్డీఆర్ ఎఫ్ /ఎస్డీఆర్ ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టామని చెప్పారు. వరదల నష్టంపై అంచనాకు కేంద్ర నుంచి బృందాలను పంపాలని జగన్‌ లేఖలో కోరారు.

భారీ వర్షాల దాటికి పలు జాతీయ రహదారులు, చెరువులు, కాలువలు తెగిపోయాయన్నారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, మౌలిక వసతులు డ్యామేజ్ అయ్యాయని, రూ.6,054.29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. 1.43 లక్షల హెక్టార్లలో వరి, శనగ, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. అరటి, బొప్పాయి. పసుపు, ఉల్లిగడ్డ, కూరగయాల పంటలు 42,299 ఎకరాల్లో నష్టపోయాయన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1,887.65 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. 71 మున్సిపల్ స్కూల్ బిల్డింగులు, కమ్యూనిటీ కేంద్రాలు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

2,254.32 కిలోమీటర్ల పొడవైన 1,013 పంచాయతీ రోడ్లు, 9 బిల్డింగులు దెబ్బతిన్నాయని చెప్పారు. 1,085 గ్రామీణ నీటి సరఫరా పనులు, 376 పంపింగ్ యంత్రాలు, 183 ఇన్ టేక్ నిర్మాణాలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. 33 కేవీ విద్యుత్ ఫీడర్లు 128, 11 కేవీ ఫీడర్లు 679, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 102 చొప్పున దెబ్బతిన్నాయని, 8,474 స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. పంట నష్టం రూ.1,353.82 కోట్లు, పండ్ల తోటల నష్టం రూ.48.06 కోట్లు, రోడ్లు, బిల్డింగుల నష్టం రూ.1,756.43 కోట్లు, నీటిపారుదల శాఖ నష్టం రూ.556.96 కోట్లు, విద్యుత్ శాఖ నష్టం రూ.252.02 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నష్టం రూ.453.33 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నష్టం రూ.381.65 కోట్లు, మున్సిపల్ పరిపాలన నష్టం రూ.1,252.02 కోట్లుగా ఉందని తెలిపారు.

వాటికి సంబంధించిన నష్టం అంచనాలను పొందుపరుస్తున్నామని, వీలైనంత త్వరగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంను రాష్ట్రానికి పంపించి ప్రాథమిక అంచనాను సిద్ధం చేయాలని సీఎం జగన్ కోరారు. మరో వైపు సీఎం జగన్‌ వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కడప, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వరద నష్టం, ప్రాణ నష్టం తదితర వివరాలపై ఆరా తీశారు. అయితే మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు జగన్‌.