Begin typing your search above and press return to search.

సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన అధిష్టానం

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:34 AM GMT
సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన అధిష్టానం
X
ఊగిసలాటకు తెరపడింది. కర్ణాటక సీఎం కుర్చీ యడ్డీకే పరిమితమైంది. ఉంటుందో.. ఊడుతుందో తెలియకు భిక్కుభిక్కుమంటూ కాలం గడిపిన యడ్యూరప్పకు ఊరటనిచ్చే కబురు పంపింది బీజేపీ అధిష్టానం.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తప్పదన్న ఊహాగానాలు బోలెడు వెలువడ్డాయి. 75 ఏళ్లు దాటిన నేతలందరినీ సాగనంపుతున్న సంకేతాలు పంపిన బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను మాత్రం కరుణించేసింది. యడ్యూరప్ప కర్ణాటక సీఎం కుర్చీ కదల్చకుండా వదిలేసింది.

బీజేపీ కోర్ కమిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని.. అవన్నీ వదంతులేనని.. మరో రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా యడ్యూరప్పనే ఉంటారని కర్ణాటక బీజేపీ కోర్ కమిటీ పేర్కొన్నది. నాయకత్వంలో మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.

ఎవరైనా సరే కోర్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అసమ్మతి వర్గాలకు బీజేపీ అధిష్టానం స్పష్టమైన హెచ్చరికలు పంపింది.

మరో రెండేళ్లలో కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల వరకు అనవసరంగా బీజేపీ అధిష్టానం కర్ణాటకలో తేనెతుట్టను కదల్చకూడదని నిర్ణయించుకుంది. ఆ ఎన్నికల వరకూ యడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా ఉంచాలని డిసైడ్ అయ్యింది.

75 ఏళ్లు నిండిన ప్రస్తు కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఉద్వాసన తప్పదని కొన్నిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు.. ఐటీ పార్కుల కోసం కేటాయించిన భూమిని గృహ అవసరాల కోసం యడ్యూరప్ప మళ్లించారని అవినీతి ఆరోపణలు చుట్టుమట్టాయి. దీనిపై లోకాయుక్త కూడా విచారణ జరుపుతోంది. దీనిపై హైకోర్టులో సవాల్ చేసిన యడ్డీకి చుక్కెదురైంది. దీంతో కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం నియమించనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వచ్చే ఎన్నికల వరకు యడ్డీనే సీఎంగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో కన్నడనాట చెలరేగిన రాజకీయ తుఫాన్ చల్లారినట్టైంది.