Begin typing your search above and press return to search.

క్లారిటీ మిస్ : సంక్షేమానికి ఓట్లు రాలవా...?

By:  Tupaki Desk   |   29 May 2022 2:49 AM GMT
క్లారిటీ మిస్ : సంక్షేమానికి ఓట్లు రాలవా...?
X
మూడేళ్ళ పాలన పూర్తి అయింది. వైసీపీ అతి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ మూడేళ్ళలో ఏం చేసింది అంటే కచ్చితంగా చెప్పలేకపోతున్న వైనం. అభివృద్ధి అన్న‌ది అయితే పూర్తిగా ఎక్కడా జరగలేదనే చెప్పాలి. మరి సంక్షేమం గురించి చెప్పుకుంటే మూడేళ్లలో చాలా చేశామని వైసీపీ నేతలు చెప్పవచ్చు, కానీ ఆ సంక్షేమం ఇపుడు వైసీపీక బిగ్ క్వశ్చన్ లా తయారైంది.

నిజానికి సంక్షేమం అన్నది దేవతా వస్త్రాల మాదిరిగా తయారైంది. ప్రభుత్వం ఇప్పటికి మూడేళ్ళుగా లక్షా నలభై వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లో వేశామని చెప్పుకోవచ్చు. కానీ ఆ సంక్షేమం అందుకున్న వారిలో ఏ కోశానా ఆనందం లేదు, దక్కని వారిలో ఎటూ అసహనం ఉంటుంది. దీనికి తోడు కోతలు పెడుతున్నారు. అమ్మ ఒడి విషయానికి వస్తే మొదట్లో పదిహేను వేల రూపాయలు అన్నారు. ఆ తరువాత అది కాస్తా పద్నాలుగు అయింది. ఇపుడు పదమూడుకు పదిపోయింది.

మరో వైపు డెబ్బై అయిదు శాతం హాజరు అని నిబంధనలు పెట్టారు. అలాగే అనేక ఇతర కండిషన్లు కూడా పెట్టారు. మొత్తానికి చూస్తే ఇతర పధకాల సంక్షేమంలో కూడా కోతలే కనిపిస్తున్నాయి. వైట్ కార్డు హోల్డర్ ఎవరు అన్న దానికి డెఫినిషన్లు మార్చేసి చాలా మందికి కార్డులు తీసేశారు. ఇలా కోతలతో పధకాల అమలు సాగుతూండడం వల్లనే గడప గడపకూ వెళ్తే మాకేంటి చేశారు అన్న నిలదీతలు వైసీపీ నేతలకు తప్పడంలేదు.

ఇంకో వైపు చూస్తే సామాజిక పించన్లు పెంపుదల మూడేళ్ళకు రెండు వేల ఏడు వందల రూపాయులు పడాలి. ఈ మే నుంచి మూడు వేల రూపాయలు పించన్లు అందాలి. కానీ ఇప్పటికి మెల్లగా రెండువేల అయిదు వందల రూపాయలు మాత్రమే వచ్చింది. దాంతో ఆ సెక్షన్లు ఆనందంగా లేవు. ఇలాంటి అనేక పరిణామాల వల్ల సంక్షేమం వల్ల ఓట్లు పడేదిలేదు అని వైసీపీకి అర్ధమైపోయింది అంటున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ఇపుడు రూట్ మార్చి సామాజిక న్యాయం అన్న కొత్త టర్న్ తీసుకుంది. తాము ఇచ్చిన పదవులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి జనాలు నమ్ముతారు, తాము గొప్ప సామాజిక విప్లవాన్ని సృష్టించామని చెప్పుకోవచ్చు అని భావించే మంత్రులతో బస్సు యాత్రను డిజైన్ చేశారు. అయితే ఇపుడు ఈ యాత్రకు కూడా అంతంతమాత్రంగా రెస్పాన్స్ వస్తోంది.

ఎలాగంటే ఈ యాత్ర వల్ల తమకు ఒనగూడేది ఏంటి అన్నదే బడుగు జీవుల ఆవేదన. వారికి పదవులు ఇచ్చారు. వారు మూతి వాసన చూడమంటే ఎలా అని సగటు జనాలు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బస్సు యాత్ర మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. మరి జనాల్లోకి వెళ్ళి గట్టిగా చెప్పుకునేందుకు ఏముంది అన్న క్లారిటీ అయితే వైసీపీకే లేదు అని అంటున్నారు.

అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికల్లో ఫలానా పని చేశామని నిబ్బరంగా వెళ్ళి ఓట్లు అడిగితేనే జనాలు తిరిగి పట్టం కడతారు. కానీ వైసీపీ మూడేళ్ల కాలాన్ని వేస్ట్ చేసిందా. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని వదిలేసిందా అన్న చర్చ వస్తోంది. ఇపుడు సంక్షేమ ఓట్లు రాల్చవు అన్న నగ్న సత్యం కళ్ళ ముందు కదులాడుతూంటే ఏం చేయాలో అర్ధం కాని సీన్ ఉంది అంటున్నారు.