Begin typing your search above and press return to search.

అమిత్ షా.. ఏపీ ఇండియాలోనే ఉంది సారూ.!

By:  Tupaki Desk   |   2 Jun 2020 10:30 AM GMT
అమిత్ షా.. ఏపీ ఇండియాలోనే ఉంది సారూ.!
X
‘రెండు సార్లు అధికారం రాగానే.. ఒంటిచేత్తో తీసుకురాగానే బీజేపీ పెద్దల కాళ్లు నేల మీద ఉండడం లేదు. ఉత్తరాది ప్రాబల్యం ముందు దక్షిణాది ప్రాభవం వెలవెలబోతూనే ఉంది. బీజేపీ కమలనాథులకు దక్షిణాది సమస్యలే పట్టడం లేదు. గుజరాతీ ప్రధాని.. ఆయన అనుంగ శిష్యుడు కూడా అదే గుజరాతీ హోంమంత్రి కలిసి దేశంలో చక్రం తిప్పుతున్నారు. తిప్పితే తిప్పారు.. కనీసం కష్టాల్లో ఉన్న రాష్ట్రాల గోడు వినాలి కదా.. ప్రధాని ఎలాగూ కలవరు.. కేంద్రమంత్రులకు ఏమైంది? ఏకంగా ఏపీ సీఎం జగన్ నే కలవలేనంత బిజీగా అమిత్ షా ఉన్నారా?’ అన్న విమర్శలు ఏపీ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

ఒక సాధారణ ఎంపీ వెళ్లినా అపాయింట్ మెంట్ ఇచ్చి కలిసే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ రద్దు చేయడం ఏంటని ఏపీ ప్రజలు, నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరుతున్న వేళ భేటి రద్దు అని కుండబద్దలు కొట్టడం ఏంటని మండిపడుతున్నారు. ముందే సమాచారం ఇవ్వాలి కదా.. పోనీ అపాయింట్ మెంట్ కుదరదంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చి క్యాన్సల్ చేయడం అవమానించడమేనని అమిత్ షా తీరును ఎండగడుతున్నారు.

రాజధాని కూడా లేని లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కేంద్రం దృష్టికి తీసుకురావడానికి ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లాలనుకుంటే అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ లాస్ట్ మినట్ లో క్యాన్సల్ చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా తీరు ఏమాత్రం బాగాలేదని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిప్పులు చెరుగుతున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.. అయితే సడన్ గా రద్దు కావడం వెనుక కారణాలేంటని ఆరాతీయగా అసలు విషయం వెలుగు చూసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ రద్దు చేసిన కారణంగానే జగన్ పర్యటన వాయిదా పడిందని తెలియవచ్చింది.

ఇవాళ రెండు గంటలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మరో రెండు మూడు గంటల్లో ఢిల్లీకి బయలు దేరాల్సి ఉండగా.. సడన్ గా అమిత్ షా ఈ భేటికి బ్రేకులు వేశారు. ఢిల్లీకి గనుక జగన్ వెళ్లుంటే ఏపీ సమస్యలు చాలా వరకు తీరి ఉండేవి.

సీఎం జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు, కీలక అధికారులతో భేటి కావాల్సి ఉంది. రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని.. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరడానికి వెళుతున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ అమిత్ షా వైఖరి కారణంగా ఈ భేటి రద్దు కావడం.. ఏపీ సమస్యలు పెండింగ్ లోనే పడిపోవడం గమనార్హం. రాష్ట్రాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.