Begin typing your search above and press return to search.

నాటి ఘ‌ట‌న‌కు ఆ ముఖ్య‌మంత్రి ప్ర‌తీకారం తీర్చుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   26 Sep 2022 4:11 AM GMT
నాటి ఘ‌ట‌న‌కు ఆ ముఖ్య‌మంత్రి ప్ర‌తీకారం తీర్చుకుంటున్నారా?
X
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో రాజ‌స్థాన్ ఒక‌టి. ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా సోనియా గాంధీ విశ్వాస‌పాత్రుడు అశోక్ గెహ్లోత్ ఉన్నారు. అయితే ఆయ‌న‌ను ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాల‌ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒత్తిడి తెస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకుని కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి అశోక్ గెహ్లోత్ స‌సేమిరా అన్నారు. సోనియా, రాహుల్ త‌ప్ప ఆ ప‌ద‌వికి ఎవ‌రూ న్యాయం చేయ‌లేర‌ని చెప్పారు. అయితే ఈ విష‌యంలో సోనియా, రాహుల్ మీద భ‌క్తి కంటే తాను కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌డితే అక్క‌డ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌న ప్ర‌త్య‌ర్థి రాజ‌స్థాన్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు స‌చిన్ పైలట్‌కు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని గెహ్లోత్ స‌సేమిరా అన్నారు. అయితే సోనియా, రాహుల్ బ‌ల‌వంతం మీద కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి అశోక్ గెహ్లోత్ ఒప్పుకున్న‌ట్టేన‌ని అంటున్నారు.

అయితే తాను రెండు ప‌ద‌వుల్లో ఉంటాన‌ని అశోక్ గెహ్లోత్ మెలిక పెట్టిన‌ట్టు చెబుతున్నారు. అంటే రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడిగా ఉంటాన‌ని కోరారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌కు రాహుల్ గాంధీ నో చెప్పారు. ఈ ఏడాది ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్‌లో తీసుకున్న ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అనే నిబంధ‌న అంద‌రికీ కొన‌సాగుతుంద‌ని రాహుల్ తేల్చిచెప్పారు. సోనియాగాంధీ సైతం ఇదే చెప్పారు. ఒక వ్య‌క్తి ఒకే ప‌ద‌విని చేపట్ట‌డం కుదురుతుంద‌ని ఆమె కూడా తెలిపారు.

దీంతో తాను కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌డితే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌న ప్ర‌త్య‌ర్థి స‌చిన్ పైల‌ట్‌కు ఇస్తార‌ని భావించిన అశోక్ గెహ్లోత్ మ‌రో మెలిక పెట్టారు. తాను సూచించిన‌వారికే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇస్తేనే తాను కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తాన‌న్నారు. స్పీక‌ర్ గా ఉన్న సీపీ జోషికి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇవ్వాల‌ని అశోక్ గెహ్లోత్ డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ అధిష్టానం స‌చిన్ పైల‌ట్ వైపే మొగ్గుచూపుతోంది.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో త‌న‌ను ముప్ప‌తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన స‌చిన్ పైల‌ట్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్క‌నీయ‌కుండా అశోక్ గెహ్లోత్ వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఈ క్ర‌మంలో 82 మంది అశోక్ గెహ్లోత్ వ‌ర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. స‌చిన్ పైల‌ట్‌ను సీఎంను చేయ‌డానికి తాము ఒప్పుకోబోమ‌ని తేల్చిచెప్పారు. అశోక్ గెహ్లోత్ ఎవ‌రికి సూచిస్తే వారికే సీఎం ప‌ద‌విని ఇవ్వాల‌ని సోనియా, రాహుల్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 82 మంది ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌కు రాజీనామా కూడా స‌మ‌ర్పిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

తాజాగా, గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతుండ‌టం విశేషం. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా ఆ ఎమ్మెల్యే మ‌రో సంచ‌లన విష‌యం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన అనంతరం మాత్ర‌మే సీఎం పదవికి అశోక్ గెహ్లోత్ రాజీనామా చేస్తారట. అంటే ఒకవేళ ఆయన కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓడిపోతే సీఎం పదవి అలాగే ఉంటుంద‌న్న‌దే ఆ ఎమ్మెల్యే మాట‌ల వెనుక అంత‌రార్థం అని అంటున్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సొంత రాష్ట్రంలోనే సచిన్‭కు వ్యతిరేకంగా అశోక్ గెహ్లోత్ చ‌క్రం తిప్పుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా స‌చిన్ పైల‌ట్ రాజ‌స్థాన్‌లో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న యువ‌నేత‌. గుజ్జ‌ర్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న దివంగ‌త కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి రాజేష్ పైల‌ట్ కుమారుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. రాజ‌స్థాన్‌లోని దౌసా నుంచి ప‌లుమార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా ఎంపిక‌య్యారు. రాహుల్ గాంధీకి మంచి మిత్రుడిగానూ ఉన్నారు. ఇంకోవైపు అశోక్ గెహ్లోత్ గాంధీల కుటుంబానికి విశ్వాస‌పాత్రుడు. దీంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.