Begin typing your search above and press return to search.

కోడెల మరణం..బాబు రాజకీయం..చెల్లుతుందా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:40 AM GMT
కోడెల మరణం..బాబు రాజకీయం..చెల్లుతుందా?
X
కోడెల మరణం పై తెలుగుదేశం పార్టీ రాజకీయం షురూ అయ్యింది. కోడెల మరణం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లనే ఉంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో దీనిపై నిరసన ప్రదర్శనలు చేయాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ వారికి పిలుపుని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలపై పోరాటం అంటూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ చేపట్టారు.

ఇప్పుడు కోడెల ఆత్మహత్యతో ఆ అంశంపై చంద్రబాబు నాయుడు మరింత పోరాడాలని డిసైడ్ చేసుకున్నారట. అయితే ఈ రాజకీయం ఎంత వరకూ చెల్లుబాటు అవుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. కోడెల ది సహజమరణం కాదని తేలింది. ఆయనే ఆత్మహత్య చేసుకున్నారు.

దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఎవరికీ తెలియదు. ఆయన ఎలాంటి లేఖను కూడా రాయలేదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత వరకూ చెల్లుబాటు అవుతుంది అనేది కొశ్చన్ మార్కే.

ఇక కోడెలపై కేసులు పెట్టడం అన్యాయమని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను తరలించిన వైనంపై కూడా కేసులు పెట్టరాదని అంటున్నారు. మరి ఇదే మాట కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేదు? అనేది గమనించాల్సిన అంశం.

కోడెల శిప్రసాద్ రావు బతికి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వని వైనం ఇప్పుడు చర్చగా మారింది. ఆయన చనిపోయే సరికి ఇప్పుడు రాజకీయంగా ఆ అంశాన్ని వాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని.. బతికి ఉన్నప్పుడు మాత్రం ఈ మాత్రం వకాల్తా పుచ్చుకుని మాట్లాడలేకపోయారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు మరణంపై చంద్రబాబు నాయుడు ఎంత రాద్ధాంతం చేసినా.. ఆయన వ్యవహరణ తీరును మాత్రం అంతా గమనిస్తున్నారని అంటున్నారు.