Begin typing your search above and press return to search.

టీడీపీకి రెబల్స్‌ బెడద

By:  Tupaki Desk   |   21 March 2019 4:59 PM GMT
టీడీపీకి రెబల్స్‌ బెడద
X
గతంలో ఎన్నడూ లేనంతగా రెబల్స్ బెడదను ఎదుర్కుంటోంది టీడీపీ. ఒక్కసారి సీట్‌ కన్‌ ఫర్మ్‌ అయ్యాక.. దాని గురించి పార్టీలో డిస్కషన్‌ కూడా జరిగేది కాదు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాళ్లు చంద్రబాబు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రోజురోజుకి ఆయన పార్టీపై పట్టు కోల్పోతున్నారు. దీంతో..చాలా నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్స్‌ చంద్రబాబుని ఇన్‌ డైరెక్ట్‌ గా బెదిరిస్తున్నారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టిక్కెట్‌ ఆశించి భంగపడిన నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామకృష్ణ చౌదరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. చింతలపూడిలో కూడా అసమ్మతి జ్వాలలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. మొన్నటివరకు మంత్రిగా పనిచేసిన పీతల సుజాతకు ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో. . నియోజకవర్గంలో ఆమె పరువంతా పోయినట్లైంది. మంత్రిపదవి పోయినప్పుడే పోయిన పరువు.. ఇప్పుడు పూర్తిగా పోయిందని ఆమె చాలా బాధపడిపోతున్నారు. అందుకే.. టీడీపీ అభ్యర్థికి ఎలాంటి సహాయం అందించడం లేదు. దీంతో.. చింతలపూడి టిక్కెట్‌ దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి.. రాజారావు ఎలాంటి ఆర్బాటం లేకుండా చాలా కామ్‌ గా వచ్చి నామినేషన్‌ వేశారు.

ఇక నరసాపురం ఎంపీ అభ్యర్థిగా టిక్కెట్‌ ఆశించిన భంగపడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా రెబల్‌ గా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అనుచరులతో సమావేశం అయ్యారు. ఎంపీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని.. రెబల్‌గా పోటీ చేసి గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్నారు సుబ్బారాయుడు. మొత్తానికి ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే మూడు నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతితో చంద్రబాబుకు చుక్కలు కన్పిస్తున్నాయి.