Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడి డిమాండ్ల జాబితా పెరుగుతోంది!

By:  Tupaki Desk   |   20 May 2019 1:22 PM GMT
చంద్రబాబు నాయుడి డిమాండ్ల జాబితా పెరుగుతోంది!
X
కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈసీని చేస్తున్న డిమాండ్ల జాబితా మాత్రం క్రమక్రమంగా పెరుగుతున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిమాండ్లను తెస్తున్నారు. ఇప్పటి వరకూ ఈవీఎంలు - వీవీ ప్యాట్ల విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు అందరికీ తెలిసినవే.

కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ తో సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. అయితే అప్పటికే వీవీ ప్యాట్స్ విషయంలో సుప్రీం కోర్టు విచారణ చేసి, స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను లెక్కించాలని కోర్టు అప్పటికే తీర్పునిచ్చింది. మళ్లీ యాభై శాతం వీవీ ప్యాట్స్ ను లెక్కించాలని కోర్టుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు , ఆయన సన్నిహిత పార్టీలకు కోర్టు ఝలక్ ఇచ్చింది.

విచారించిన పిటిషన్ ను ఎన్ని సార్లు విచారించాలని ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారి పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న డిమాండ్ కోర్టులో కొట్టివేతకు గురి అయ్యింది. అయితే చంద్రబాబు నాయుడు అంతటితో కూడా ఆగడం లేదు. ఆ తర్వాత కూడా మీడియా ముందుకు వస్తే చాలు.. 'వీవీ ప్యాట్లు.. యాభై శాతం లెక్కించాలి..' అంటూ మాట్లాడుతూ ఉన్నారాయన. ఇప్పటికీ ఈసీని అదే కోరుతున్నట్టుగా చంద్రబాబు చెబుతున్నారు. ఈసీనేమో దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

ఆ సంగతలా ఉంటే ఈసీ ముందు కొత్త డిమాండ్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఈవీఎంలను లెక్కించడాని కన్నా ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారిప్పుడు. ఈవీఎంలు - వీవీ ప్యాట్ ల విషయంలో చంద్రబాబు కొత్త డిమాండ్ ఇది! ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో ధర్నాకు కూడా దిగుతున్నారట. అలాగే కోర్టులో కూడా ఈ మేరకు పిటిషన్ ను దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజులూ చేయని ఈ డిమాండ్ ను చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దీనిపై ఈసీ ఏమంటుందో, కోర్టు ఏమంటుందో!