Begin typing your search above and press return to search.

బాబు చివరి అస్త్రం...జగన్ కు రెండు చేతులెత్తి మొక్కారు

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:05 AM GMT
బాబు చివరి అస్త్రం...జగన్ కు  రెండు చేతులెత్తి మొక్కారు
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ తనదైన శైలి ‘జోలె’ పోరుకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు... తన అభీష్ఠాన్ని నెరవేర్చుకునేందుకు దాదాపుగా అందుబాటు లో ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించారనే చెప్పాలి. అయితే అమరావతి వేదికగా టీడీపీ చేసిన దోపిడీని బట్టబయలు చేయడంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు ఆటలు సాగడం లేదు. ఈ క్రమం లో ఏపీకి మూడు రాజధానుల విషయంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రత్యేకంగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఏకంగా గంటన్నర పాటు ప్రసంగించిన చంద్రబాబు... అమరావతిలోనే రాజధానిని కొనసాగించుకోవాలనే దిశగా చివరి అస్త్రంగా సీఎం జగన్ కు రెండు చేతులెత్తి నమస్కరించారు. అంతేకాకుండా చిన్న వాడైనప్పటికీ జగన్ కు తాను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని వేడుకున్నారు.

అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలన్న తన డిమాండ్ ను వినిపించేందుకు ఏకంగా గంటన్నర పాటు ప్రసంగించిన చంద్రబాబు దాదాపు గా అన్నీ పాత విషయాలనే ప్రస్తావించారని చెప్పాలి. అమరావతికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం హోదాలో కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా చంద్రబాబు ప్రత్యేకం గా ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిాదిద్దేందుకు తాము ఎన్నో చర్యలు చేపట్టామని, వాటిని తమ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ కూడా కొనసాగించాల్సిందేనని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతారా? అని కూడా జగన్ సర్కారు వైఖరిని ప్రశ్నించారు. అమరావతిలో తమ ప్రభుత్వం కట్టిన అసెంబ్లీ తాత్కాలికం కాదని మరో మారు చంద్రబాబు బుకాయించే యత్నం చేశారు.

అధికార వికేంద్రీకరణ మాట చెబుతున్న జగన్ సర్కారు... దానిని వదిలేసి పరిపాలన వికేంద్రీకరణకు పూనుకుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి తెలియని వారే ఢిల్లీ, చెన్నై రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, రాజధానుల వల్ల జరగదని కూడా చంద్రబాబు తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అనేది రాజధానుల వల్ల జరగదన్న ఆయన అభివృద్ధి చేస్తేనే జరుగుతుందని కూడా ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా రాజధానులను ఎవరు పెట్టినా... రాష్ట్రానికి మధ్యలోనే పెట్టారని కూడా ఆయన మరో వ్యాఖ్య చేశారు. శివరాకృష్ణన్ కమిటీని ప్రస్తావించిన చంద్రబాబు... ఆ కమిటీ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధానిని పెట్టాలని చెప్పిందని మరో వ్యాఖ్య కూడా చేశారు. మొత్తంగా తన మాటల్లో పూర్తి కాంట్రాస్టును చూపిన చంద్రబాబు.. అమరావతిలోనే రాజధానిని కొొనసాగించాలన్న తన డిమాండ్ ను నేల విడిచి సాము చేసిన చందంగా చెప్పుకొచ్చారు.

అయితే తాను చెప్పిన ప్రతి అంశానికి వైసీపీ నుంచి అదిరి పోయే కౌంటర్లు పడుతున్న నేపథ్యం లో ఇలా కాదనుకున్న చంద్రబాబు... చివరికి కాళ్ల బేరానికి వచ్చేశారన్న వాదన వినిపిస్తోంది. సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు... తన వాదనకు సీఎం జగన్ మొగ్గు చూపే అవకాశాలు లేవని గ్రహించి తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ సందర్భంగా జగన్ కు రెండు చేతులెత్తి నమస్కరించిన చంద్రబాబు... అన్నట్లు గానే రెండు చేతులెత్తి జగన్ కు నమస్కరించారు. ఈ సందర్భం గా చంద్రబాబు ఏమన్నారంటే...‘అమరావతి ని ఆపేశారు. పెట్టుబడులు పోతున్నాయి. చిన్న వాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు. మూడు రాజధానులు ప్రపంచం లో ఎక్కడా విజయవంతం కాలేదు. కడపకిచ్చినట్టు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిధులిస్తే మరింత సంతోషిస్తా. అంతేతప్ప రాజకీయంగా వెళితే మీకు, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతుల గురించి ఆలోచించండి’ అని చంద్రబాబు తనదైన మార్కు వ్యాఖ్యలు చేశారు.