Begin typing your search above and press return to search.

కన్నబాబూ.. అదిరే కామెంట్ వేశారండీ

By:  Tupaki Desk   |   20 May 2019 2:47 PM GMT
కన్నబాబూ.. అదిరే కామెంట్ వేశారండీ
X
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో జాతీయ పార్టీల్లో ఓ మేర సందడి తగ్గినట్టే కనిపిస్తోంది. చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... కేంద్రంలో మరోమారు ఎన్డీఏదే అధికారం అని తేల్చేయడంతో దాదాపుగా అన్ని పార్టీలు కూడా సైలెంట్ అయిపోయాయి. అయితే ఈ తరహా పరిస్థితి ఏపీలో మాత్రం కనిపించడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉండగా - మరికొన్ని వైసీపీకి అనుకూలంగా మొగ్గాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి వాగ్యుద్దం జరిగిందో... ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఓ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... వీవీ ప్యాట్ల లెక్కింపుపై తనదైన శైలి పోరాటాన్ని కొనసాగించేందుకే తీర్మానించారు. ఈ క్రమంలో రేపు ఆయన ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై టీడీపీ స్పందన - వీవీ ప్యాట్లపై చంద్రబాబు పోరాటాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ కీలక నేత - కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు... తనదైన శైలి సెటైర్లు సంధించారు.

నిన్నటి ఎగ్జిట్ పోల్స్... చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్సేనని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత చంద్రబాబు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. లగడపాటి సర్వే... టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకేనని కూడా కురసాల చెప్పారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు... 2014 ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించిన సంగతి తెలియదా? అని కూడా ప్రశ్నించారు. ఇక చివరగా ఈవీఎంలపై చంద్రబాబు పోరాటాన్ని తనదైన సెటైర్ సంధించిన కురసాల... చంద్రబాబు తీరును చూస్తుంటే... కౌంటింగ్ ను టీడీపీ కార్యాలయంలో నిర్వహించాలని చంద్రబాబు ఈసీని డిమాండ్ చేస్తారేమోనని సంచలన వ్యాఖ్య చేశారు. ఈ సెటైర్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.