Begin typing your search above and press return to search.

వారితో టచ్లో ఉండమని పార్టీ నేతలకు బాబు ఆదేశం?

By:  Tupaki Desk   |   24 April 2019 7:55 AM GMT
వారితో టచ్లో ఉండమని పార్టీ నేతలకు బాబు ఆదేశం?
X
పరిస్థితి కొంచెం అంటూ ఇటూ అయ్యే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - జనసేన తరఫున గెలిచే వారిని తన వైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. పార్టీ సమీక్షా సమావేశంలో ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

హంగ్ తరహా పరిస్థితి వచ్చి - తెలుగుదేశం పార్టీ మెజారిటీ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోతే.. జనసేన - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లనూ చేయాలని పార్టీ ముఖ్య నేతలను బాబు ఆదేశించారట.

పార్టీ సమీక్ష సమావేశంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ గురించి చర్చించినట్టుగా సమాచారం. తమ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అలాగే జనసేనలోనూ కొందరు గెలిచే అవకాశాలున్నాయి. ఒకవేళ జనసేన అనూహ్యంగా పుంజుకుని.. ముక్కోణపు పోరుగా మారి - మెజారిటీ ఎవరికీ రాని పక్షంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను - జనసేన నుంచి మరి కొందరిని తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రణాళిక చంద్రబాబు వద్ద రెడీగా ఉందని సమాచారం.ఇప్పటికే 'గెలిస్తే ఇటు వైపు వస్తారు..' అనే అంచనాలున్న నేతల జాబితాను చంద్రబాబు నాయుడు రెడీ చేయించుకుంటున్నారట. ఎవరి ద్వారా ప్రొసీడ్ అయితే ఎవరిని సంప్రదించవచ్చు అనే అంశం గురించి కూడా కసరత్తు సాగుతూ ఉన్నట్టుగా సమాచారం.

ఒకవైపు హంగ్ తరహా పరిస్థితి వస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ చేజారకుండా చూసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ - అలాంటి పరిస్థితి వస్తే వైఎస్సార్సీపీ - జనసేనల నుంచి ఎమ్మెల్యేలను రప్పించుకునే ప్లాన్ ను బాబు ఇప్పటికే అమలు పెట్టడం ప్రారంభించారని భోగట్టా!