Begin typing your search above and press return to search.

2 కొవ్వొత్తుల‌తో 9 రోజులూ 'చంద్ర' వెలుగేన‌ట‌!

By:  Tupaki Desk   |   20 Oct 2018 11:09 AM GMT
2 కొవ్వొత్తుల‌తో 9 రోజులూ చంద్ర వెలుగేన‌ట‌!
X
అగ్గిపుల్ల...స‌బ్బుబిళ్ల...కుక్క‌పిల్ల‌....కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అన్నారు మ‌హా క‌వి శ్రీ‌శ్రీ‌! శ్రీ‌శ్రీ నుంచి స్ఫూర్తి పొందిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు...కొద్దిగా ఇంప్రువైజ్ చేసి కాదేదీ ప‌బ్లిసిటీక‌న‌ర్హం అని ఆ విధంగా ముందుకు పోతున్నారు. బాబుగారి గొప్ప‌ల డ‌ప్పులు కొట్టి ఆయ‌న అనుకూల మీడియా రోజు రోజుకీ రాటుదేలుతోంది. స‌ముద్రాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు చూస్తోన్న బాబుగారి గురించి ఎంత చెప్పినా తక్కువేన‌న్న‌ది వేరే విష‌యం. ఇక తాజాగా తిత్లీ తుపాను నేప‌థ్యంలో బాబు గారి ప‌బ్లిసిటీ పిచ్చ ప‌రాకాష్ఠ‌కు చేరింది. చంద్ర‌బాబులోని దాన‌క‌ర్ణుడు మ‌రోసారి మేలుకోవ‌డంతో సిక్కోలు ప్ర‌జ‌లు చిక్కుల్లో ప‌డ్డారు. ఊరుమ్మ‌డిగా కూరగాయలు కొనేందుకు 500 రూపాయలిచ్చిన చంద్రబాబు.....తాజాగా కొవ్వొత్తుల పంపిణీతో మ‌రోసారి శిబిచ‌క్ర‌వ‌ర్తి అవ‌తార‌మెత్తారు. తుపాను బాధిత గ్రామంలో ఒక్కో ఇంటికి రెండు కొవ్వొత్తులు పంపిణీ చేసిన బాబు....ఆ ఇళ్ల‌లో 9 రోజుల పాటు వెలుగులు నింపాల‌నే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

వాస్త‌వానికి ఎంత పెద్ద కొవ్వొత్తి అయినా.....3-4 గంట‌ల పాటు వెలుగునిచ్చి క‌రిగిపోతుంది. ఆ లెక్క‌న బాబుగారిచ్చిన రెండు కొవ్వొత్తులు.. సుమారు 10గంట‌లు వెలుగునిచ్చాయ‌నుకుందాం. అటువంటిది 9 రోజులకు 2 కొవ్వొత్తులు ఏ లెక్క‌న చంద్ర‌బాబు స‌ర‌ఫ‌రా చేశారో అయ‌న‌కు మాత్ర‌మే తెలియాలి. తుపాను ప్రారంభమ‌య్యే రోజుకన్నా ఓ రోజు ముందు రోజు ఆ గ్రామంలో క‌రెంట్ లేదు. అటువంటిది ఆ రెండు కొవ్వొత్తులు ఇచ్చి వారిని వెక్కిరించ‌డం బాబుకే చెల్లింది. ఇక చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేసిన‌ పాల ప్యాకెట్ల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. త‌మ బ్రాండ్ `హెరిటేజ్` తో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న బాబు....తుపాను ప్రాంతాల్లో పాలు - పెరుగు ప్యాకెట్లు సరఫరా చేయించారు.దాదాపు 60శాతం పాలు - పెరుగు ప్యాకెట్ల‌లో నీళ్ల‌మ‌యమ‌ని....అక్కడి ప్ర‌జ‌లు క‌న్నీటిమ‌య‌మ‌య్యారు. త‌మ‌ పిల్లలు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

700 గడపలున్న ఊరికి 70 లైట్లు సరఫరా చేయ‌డం - 300 గడపలున్న గ్రామానికి 150 ఆహార పొట్లాలు సరఫరా చేయ‌డం వంటివి మ‌రికొన్ని మ‌చ్చుతున‌క‌లు. కేజీ ఉల్లిపాయలు 700 గ్రాములే తూగుతున్నాయి. 25 కిలోల బియ్యం 22 కిలోలే కాటాకు వ‌స్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేవలం 2 మండలాలకు మాత్రమే ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మరో 2 మండలాల్లో 50శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా మండలాలన్నీ అంధకారంలో మ‌గ్గుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం మొత్తంగా 85శాతం విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌రించామ‌ని, కూలిపోయిన చెట్లు తొలిగించి సిక్కోలు ప్ర‌జ‌ల‌ను ఉద్ధ‌రించామ‌ని గ‌ప్పాలు కొడుతోంది. తుపానులో ఈ త‌ర‌హా `అవినీతి`త‌ప‌న ప‌డుతోన్న బాబు....ప‌బ్లిసిటీకి మాత్రం అస్స‌లు మొహ‌మాట‌ప‌డ‌డం లేదు.