Begin typing your search above and press return to search.

చంద్రబాబు, లోకేష్ ను ఇరికించేశాడా ?

By:  Tupaki Desk   |   22 July 2021 5:09 AM GMT
చంద్రబాబు, లోకేష్ ను ఇరికించేశాడా ?
X
‘నా మొబైల్ నుండి మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో వాట్సప్ చాటింగ్ చేస్తే తప్పేంటి’..ఇది తాజాగా వైసీపీ ఎంపి రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు.

తాను ఇరుక్కోవటమే కాకుండా చంద్రబాబునాయుడును కూడా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు ఇరికించేశారా ? అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటు రఘురామ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజద్రోహం నేరంపై సీఐడీ పోలీసులు అరెస్టు చేసినపుడు ఆయన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇపుడా మొబైల్లో ఎంపి ఇతరులతో జరిపిన వాట్సప్ చాటింగ్ లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

ఎంపి చాటింగ్స్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ తో జరిపిన చాటింగ్స్ ఒకఎత్తైతే తాజాగా రఘురామ చేసిన వ్యాఖ్యలు మరోఎత్తుగా ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ తో ఎంపి చాటింగ్స్ బయటకు రావటంతో ఎలా స్పందించాలో మొత్తం టీడీపీకి అర్ధంకావటంలేదు. వాట్సప్ చాంటిగులను అంగీకరించలేరు, అలాగని ఖండిచనూలేకపోతున్నారు. సీఐడీ అఫిడవిట్ ద్వారా వెలుగు చూస్తున్న చాటింగ్స్ పై చంద్రబాబు కానీ లోకేష్ కానీ చివరకు టీడీపీలో ఒక్క నేత కూడా నోరిప్పటంలేదు.

ఇక తాజాగా రఘురామ మాట్లాడుతూ తను చంద్రబాబుతో వాట్సప్ చాటింగ్ చేస్తే తప్పేంటని అడిగారు. తన మొబైల్లో వెయ్యి నెంబర్లుంటాయని అందులో చంద్రబాబు నెంబర్ కూడా ఉండచ్చన్నారు. తాను చంద్రబాబుతో కాకపోతే తనిష్టం వచ్చిన వారితో చాటింగ్ చేస్తానన్నారు. అంటే ఎంపి వ్యాఖ్యలను గమనిస్తే చంద్రబాబుతో చాటింగ్ చేసినట్లు కమిట్ అయిన విషయం అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది ఎంపి తనిష్టం వచ్చినట్లుగా ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు తప్పులేదు.

కానీ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ను చంద్రబాబుకు పంపి దాంట్లో చంద్రబాబు మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఫెయిర్ కాపీ ప్రకారమే కోర్టులో అఫిడవిట్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది. అలాగే లోకేష్ తో వాట్సప్ చాటింగ్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటమే అభ్యంతరంగా మారింది. మొత్తానికి చంద్రబాబు, లోకేష్ తో వాట్సప్ చాటింగ్ చేశానని కమిట్ అవ్వటం ద్వారా వాళ్ళిద్దరినే కాకుండా యావత్ టీడీపీని ఎంపి ఇబ్బందుల్లోకి నెట్టినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది.

మొబైల్ ఫోన్ వాడకానికి సంబంధించి ఇబ్బందుల్లో పడటం ఇది రెండోసారి. మొదటిసారి ఓటుకునోటు కేసన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా కేసీయా ను ఇబ్బందుల్లోకి నెట్టేద్దామన్న ఆలోచనతో స్టీఫెన్ సన్ ఓటుకోసం రేవంత్ రెడ్డి అండ్ కో ను రంగంలోకి దింపారు. విషయం లీకైనా ఏసీబీ పన్నిన ఉచ్చులో రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దాంతో చంద్రబాబు పాత్ర కూడా బయటపడింది. ఇపుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ ఎంపితో చేతులు కలిపి మొబైల్ వాట్సప్ చాటింగ్ లో దొరికిపోయి రెండోసారి బుక్కైపోయారు. సరే దీనివల్ల చంద్రబాబుకు సాంకేతికంగా ఇబ్బందులేమన్నా వస్తాయని అనుకోవటంలేదు. కాకపోతే ప్రజాకోర్టులో మాత్రం పలుచనైపోయారు.

నిజానికి ఎంపి-జగన్ మధ్య వివాదంలో చంద్రబాబు తలదూర్చటమే అనవసరం. ఎవరిపై ఎవరిది ఆధిపత్యమో వాళ్ళిద్దరే తేల్చుకుంటారు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కూడా అనవసరంగా చంద్రబాబు వేలుపెట్టారు. జగన్ను ఇబ్బంది పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే అనవసరంగా అందులో టీడీపీ తరపున చంద్రబాబు ఇంప్లీడ్ పిటీషన్ వేయించారు. దాంతో కాంగ్రెస్-జగన్ వివాదం కాస్త కాంగ్రెస్+టీడీపీ-జగన్ గా మారిపోయింది.