Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్... డాక్టర్ డ్యూటీలో టీడీపీ అధినేత

By:  Tupaki Desk   |   31 March 2020 4:30 PM GMT
కరోనా ఎఫెక్ట్... డాక్టర్ డ్యూటీలో టీడీపీ అధినేత
X
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్... దాదాపుగా అన్ని రంగాలపై తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే మెజారిటీ దేశాల్లో లాక్ డౌన్ అమలవుతున్న వేళ... నిత్యం జనాల్లో ఉండాలని భావిస్తున్న రాజకీయ నేతల ఆశలకు కూడా గండి పడిపోయింది. కరోనా నేపథ్యంలో అసలు బయటకు వచ్చేందుకే జడిసిపోతున్న జనాలతో పాటు రాజకీయ నేతలు కూడా నాలుగు గోడలకే పరిమితమైపోయారు. ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు... ఏపీని కరోనా చుట్టుముట్టిన వెంటనే... అమరావతిలోని తన అద్దె బంగ్లాను వదిలేసి ఎంచక్కా... పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో సకల హంగుల తో నిర్మించుకున్న సొంతింటికి మారిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచే నిత్యం టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్పరెన్సులు అంటూ తన అనుకూల మీడియాలో ఓ రేంజిలో హల్ చల్ చేస్తున్నారు.

ఇలాంటి వేళ... మాట్లాడటానికి రాజకీయాలేమీ లేవని గ్రహించారో? ఏమో? తెలియదు గానీ... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బాబు... తనలో అంతర్లీనంగా దాగి ఉన్న వైద్యుడిని తెర మీదకు తీసుకొచ్చేశారు. మంగళవారం హైదరాబాద్ లోనే నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రబాబు తనదైన శైలిలో విశ్వరూపం చూపారు. తనలోని డాక్టర్ ను బయటి ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు.. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా దరి చేరకుండా ఏఏంం చేయాలి? కరోనాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఏమిటి? అసలు నిజాలు ఏమిటి? అంటూ ఏకబిగిన చాలా అంశాలనే బాబు ప్రస్తావించారు. సరే మరి... డాక్టర్ గా మారిపోయిన చంద్రబాబు నోట నుంచి వినిపించిన కరోనా సంగతులు ఆయన మాటల్లోనే విందాం పదండి.

"కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నారు. నేను ఈ విషయంపై రాజకీయం చేయబోను. కానీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలి. అయితే ఈ ప్రభుత్వం కరోనా విపత్తు నిర్వహణలో విఫలమవుతోంది. సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోయి ఎక్కడికక్కడ వ్యాపించే పరిస్థితులు వచ్చాయి. దాని పర్యవసానమే పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కరోనా టెస్టు సెంటర్లు తక్కువగా ఉన్నందువల్ల, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఒక కరోనా వ్యక్తి బయటికి వెళితే 6 రోజుల్లో 3,600 మందికి వ్యాపింపచేయగలడు. కరోనాపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశా. ఇంకా రాస్తా. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.

కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక స్థాయి దాటితే అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్యం అందించలేం. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కారణంగా 62 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. భారత్ లో 49 రోజుల లాక్ డౌన్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను రూపుమాపాలి. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంది. అయితే అలాంటి దేశాల్లోనూ కరోనా ఉనికి ఉంది. రాష్ట్రంలోనూ కరోనా తీవ్రంగానే ఉంది. ఒక్కరోజులో 17 కేసులు నమోదు కావడం అందుకు నిదర్శనం. హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వారిలో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ సామాన్యులనే కాదు వైద్యులను కూడా కబళిస్తుండడం ఆందోళనకరం. వైద్యులు, ఇతర సిబ్బందికి తగిన రక్షణ కవచాలు అందించాలి. రాష్ట్రంలో రక్షణ కవచాల కొరత ఉంది. రేషన్ దుకాణాలు తెరవడం వల్ల అందరూ రోడ్లపైకి వచ్చారు. కానీ భౌతికదూరం పాటించాల్సిన పరిస్థితుల్లో ఇలా గుమికూడడం మంచిది కాదు. వలంటీర్ల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవాలి.

చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందన్న కారణంతో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతిన్నది. రొయ్యలన్నీ చెరువుల్లోనే ఉన్నాయి. కొనే నాథుడే లేడు. ప్రభుత్వమే రొయ్యల రైతులను ఆదుకోవాలి. హార్టీకల్చర్ రంగం కూడా కుదేలైంది. పంటలన్నీ పొలాల్లోనే ఉండిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వలసదారులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి. లాక్ డౌన్ కారణంగా కొందరు ఇళ్లలో అదేపనిగా ఆలోచిస్తున్నారు. కరోనా వస్తే చనిపోతారని భయపడుతున్నారు. అయితే కరోనా సోకినవాళ్లందరూ చనిపోరు. వయసు పైబడినవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లకే ఈ వైరస్ ప్రమాదకరం. కరోనా వ్యాధి ప్రమాదకరమైనది. కరోనా సోకిన వ్యక్తి ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువును ఇతరులు తాకితే వారికి కూడా కరోనా సోకుతుంది. ఆ వస్తువును ఎంతమంది తాకితే అందరికీ కరోనా వస్తుంది. అందుకే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.

దక్షిణ కొరియాలో కేవలం ఒక వ్యక్తి ద్వారా వేలమందికి వ్యాపించిన విషయం మరువరాదు. అక్కడ ఒక వ్యక్తి నుంచి కొంతమందికి, ఆ కొంతమంది నుంచి అనేకమందికి... ఆ విధంగా రెట్టింపు అయింది.కరోనా బాధితులను సమాజం నుంచి వేరుచేసి చికిత్స అందించాల్సి ఉంటుంది. దీనిపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను నివారించుకోవచ్చు. వేడినీళ్ల ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వేడినీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలి. అంతేకాకుండా ఆహారం పరిమితంగానే, అవసరం మేరకు తరచుగా తీసుకోవాలి. మంచి నీరు ఎక్కువగా తాగుతుండాలి. చిరుతిండ్లు తగ్గించాలి. వండిన ఆహారం కారణంగా కరోనా రాదని తేలింది. ఆరోగ్యం కోసం యోగా చేయాలి. ఎక్కడికైనా బయటికి వెళ్లి వచ్చినప్పుడు చెప్పులతో సహా ప్రతి ఒక్క వస్తువును శుద్ధి చేసుకోవాలి. తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఉన్న జామపండ్లు, ఇతర ఫలాలు ఎక్కువగా తీసుకోవాలి" ఇలా చంద్రబాబు కరోనా జాగ్రత్తలను ఏకరువు పెట్టారు. ఈ చిట్టా చూస్తుంటే... చంద్రబాబు డాక్టర్ గా మారిపోయినట్టే కదా. అయితేనేం... జనానికి చాలా విలువైన సలహాలు, సూచనలను చంద్రబాబు అందజేశారు.