Begin typing your search above and press return to search.

బాబుకు...మందుబాబుల‌కు భలే దోస్తీ

By:  Tupaki Desk   |   15 Nov 2019 11:06 AM GMT
బాబుకు...మందుబాబుల‌కు భలే దోస్తీ
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలోని ప్ర‌భుత్వం మ‌ద్యం పాల‌సీపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గతంలో ఉన్న 4వేల 380 మద్యం షాపులను 3వేల 500లకు తగ్గించారు. అటు బిజినెస్ సమయాన్ని ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పరిమితం చేశారు. భారీగా రేట్లు పెంచడం కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యంలో ఓ భాగ‌మే. అయితే, దీనిపై సీఎం జగన్‌‌ను టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేశారు. మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులే.. మద్యం అమ్మకాల్లో బిజీ అయిపోయారని చంద్రబాబు ఆరోపించారు.

ఇసుక దీక్ష చేప‌ట్టిన చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా మ‌ద్యం గురించి సైతం ప్ర‌స్తావించారు. తాగుబోతులు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ఆవేద‌న వెళ్ల‌బోసుకుంటున్నార‌ని..మ‌ద్యం ధ‌ర‌లు పెరిగాయ‌ని ఓ వ్య‌క్తి చెప్పాడ‌ని...చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇసుక దీక్ష‌లో మ‌ద్యం గురించి ప్ర‌స్తావించడం ద్వారా చంద్ర‌బాబు ఏం చెప్ప‌ద‌ల్చుకున్నారనే విష‌య‌మే ఓ వింత అయితే...త‌న‌తో మందుబాబులు సైతం ట‌చ్‌లో ఉన్నార‌ని బాబుగారు ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. స‌హ‌జంగానే ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. మ‌ద్య నిషేధానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పుప‌డుతున్నారా లేదంటే..ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ఆయ‌న అభ్యంత‌రం తెలుపుతున్నారా? అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, ఏపీలో కొత్త మద్యం విధానం సత్ఫలితాలు ఇస్తోంది. మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 అక్టోబర్ లో 32లక్షల 28వేల 366 కేసుల లిక్కర్ ను విక్రయించగా … ఈ ఏడాది అక్టోబర్‌లో 23లక్షల 60వేల 89కేసుల మద్యం మాత్రమే అమ్మారు. దీంతో 27శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి,. బీరు అమ్మకాలు 2018 అక్టోబర్ లో 23లక్షల 86వేల 397కేసులు అమ్మడుపోగా, ఈ ఏడాది అదే మాసంలో 10 లక్షల 40వేల 539కేసులు మాత్రమే విక్రయించారు. దీంతో 56.4శాతం బీర్ల అమ్మకాల తగ్గుదల నమోదైంది.