Begin typing your search above and press return to search.

బాలయ్య మీద బాబు అసంతృప్తి... అసలు ఏం జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   28 Sep 2022 2:30 AM GMT
బాలయ్య మీద బాబు అసంతృప్తి... అసలు ఏం జరుగుతోంది...?
X
ఎన్టీయార్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో నారా వారి సారధ్యాన నడిచే టీడీపీలో చివరికి ఏకైక నందమూరి వారసుడుగా బాలయ్య మాత్రమే ఉన్నారు. ఆయన రెండు సార్లు వరసగా హిందూపురం నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు. ఆయన లేటెస్ట్ హిట్ అఖండతో మళ్లీ సినిమాల్లో కూడా ఫామ్ లోకి వచ్చారు. బాలయ్య ఈ మధ్య సినిమాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పార్టీ విపక్షంలో ఉన్న వేళ కూడా ఆయన అసెంబ్లీకి పెద్దగా వచ్చింది లేదు. ఆయనకు తండ్రి ఎన్టీయార్ పెట్టిన పార్టీలో జస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ పదవే ఇచ్చి బాబు సర్దుకోమన్నారని చెబుతారు.

అదే లోకేష్ కి తనతో సమానంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి తన వారసుడిగా చూపిస్తున్నారు. టీడీపీలో ఏది మాట్లాడాలన్నా చంద్రబాబు, చినబాబు తప్ప ఎవరూ మాట్లాడరాదు. ఇది అనధికారికంగా అమలవుతున్న నిబంధనగా చెబుతారు. పేరుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నా ఆయన ఎపుడూ విధానపరమైన ప్రకటనలే చేయలేరు. జిల్లాల టూర్లు కూడా అచ్చెన్న సొంతంగా చేయలేరు.

ఇదీ టీడీపీలో సీన్. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా తన పుత్రరత్నాన్ని సీఎం సీటు మీద కూర్చోబెట్టాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు నందమూరి వారి అసలు సిసలు వారసుడు బాలయ్య పార్టీలో ఉండడం కొంత ఇబ్బందే అని అంటున్నారు. నిజానికి 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినపుడు బాలయ్యకు కనీసం మంత్రి పదవి ఇస్తారనుకున్నా జరగలేదు. అదే ఎమ్మెల్యే కాకున్నా ఎమ్మెల్సీ చేసి మరీ లోకేష్ కి మంత్రి పదవిని కట్టబెట్టారు.

ఇలా టీడీపీలో బాలయ్య ప్లేస్ ఏంటో ఎప్పటికపుడు చెప్పకనే చెబుతున్న వైనం ఉంది. ఈ నేపధ్యంలో ఆ మధ్యన తన సోదరి, బాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నుంచి కొందరు అనుచిత్రమైన వ్యాఖ్యలు చేస్తే బాలయ్య ఖండించారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేగా కాకుండా టోటల్ నందమూరి ఫ్యామిలీని ముందు పెట్టుకుని ఆ కుటుంబ సభ్యుడిగానే అన్నది కూడా నాడు చర్చ జరిగింది.

ఇక ఇటీవల బాలయ్య తన సతీమణి వసుంధరతో తన సొంత నియోజకవర్గం హిందూపురం లో ఎన్టీయార్ సంచార ఆరోగ్య వాహనాన్ని ప్రారంభించారు. ఆ వాహనం మీద ఎన్టీయార్ ఫోటో తన ఫోటో తప్ప టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో లేదు. దాంతోనే ఇద్దరి మధ్యన గ్యాప్ ఉందని వార్తలు వినిపించాయి. ఇపుదు చూస్తే విజయవాడలోని ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరుని వైసీపీ సర్కార్ మార్చేసింది. అయితే దాని మీద స్పందించిన బాలయ్య ట్వీట్ చేశారు.

అందులో ఎన్టీయార్ తెలుగుజాతి ఖ్యాతి అని ఆయనే సంస్కృతి అని, ఇలా తెలుగునకు ముడిపెడుతూ చేసిన ట్వీట్ కొంత వివాదం అయింది. దాంతో చంద్రబాబు బాలయ్య ప్రకటన మీద గుస్సా అవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది హెల్త్ వర్శిటీ వివాదంలో టీడీపీ గట్టిగా అఫెన్స్ ఆడుతున్న వేళ వైసీపీ డిఫెన్స్ లో పడ్డ వేళ బాలయ్య సడెన్ గా ట్వీట్ చేసి మొత్తం సీన్ మార్చేశారు అని బాబు అభిప్రాయపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తునాయి.

బాలయ్య చేసిన ప్రకటన వల్ల కమ్మేతరులు, రాష్ట్రేతరుల నుంచి ఎన్టీయార్ పేరు మార్పు విషయంలో టీడీపీకి మద్దతు పోయిందని బాబు అంచనా కడుతున్నారుట. ఎన్టీయార్ కి కేరాఫ్ తెలుగు జాతిగా బాలయ్య ట్వీట్ చేయడం పట్ల కూడా ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఇది వైసీపీకి కలసివచ్చే అంశంగా మారింది అని అంటున్నారుట. బాలయ్య తాను ట్వీట్ చేసే ముందు తనను సంప్రదిస్తే బాగుండేది అన్నది బాబు మాటగా ప్రచారం అవుతోంది.

ఇదిలా ఉంటే బాలయ్య ట్వీట్ తో అసలు ఇష్యూ పక్కకు పోయిందని, ఎన్టీయార్ వెన్నుపోటు మీద దీని వల్లనే వైసీపీ మాట్లాడేందుకు అవకాశం వచ్చిందని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయిట. అయితే చంద్రబాబుని ఈ ట్వీట్ ఇబ్బంది పెట్టిందా లేక హిందూపురం లో తిరుగుతున్న ఆరోగ్యవాహనం మీద తన ఫోటో పెట్టలేదని కోపం ఉందా లేక లోకేష్ వారసుడిగా చేస్తే బాలయ్య నుంచి ఏమైనా సమస్య వస్తుందని ఊహించి ఇలా గుస్సా అవుతున్నారా అన్నది తెలియడంలేదు అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య ట్వీట్ మీద చంద్రబాబు గుస్సా అవుతున్నారు అన్నదైతే టీడీపీలో గుసగుసలుగా వినిపిస్తున్న విషయం. నిజమేంటో తరువాత జరిగే పరిణామాలే చెప్పాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.