Begin typing your search above and press return to search.

కొత్త లెక్క..మన దగ్గర కరోనా రోగి నెలలో ఎంతమందికి అంటిస్తాడంటే?

By:  Tupaki Desk   |   8 April 2020 9:50 AM GMT
కొత్త లెక్క..మన దగ్గర కరోనా రోగి నెలలో ఎంతమందికి అంటిస్తాడంటే?
X
కరోనా పాజిటివ్ అయినోళ్లు.. మానవ బాంబుల కంటే డేంజరా? అంటే అవుననే చెప్పాలి. ఒక మానవ బాంబు ఎంత తీవ్రత ఉన్నా.. వంద నుంచి రెండు వందల మంది మీద మాత్రమే తన ప్రభావాన్ని చూపించగలడు. కానీ.. కరోనా పాజిటివ్ రోగి అలా కాదు. అలా అంటించుకుంటూ పోతే.. వేలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసే సత్తా ఉంటుంది. ఈ లెక్కన చూసినప్పుడు మానవ బాంబుతో పోలిస్తే.. కరోనా పాజిటివ్ వ్యక్తి మహా డేంజర్ అని చెప్పక తప్పదు. మానవ బాంబుతో జరిగే విధ్వంసం ఒక్కసారిగా జరిగి పోతుంది. కానీ.. కరోనా పాజిటివ్ అయినోళ్లు గుట్టుచప్పుడు కాకుండా.. అంతకంతకూ అంటిస్తూ.. అంచనా వేయలేని విధంగా విస్తరించే సత్తా ఉంటుంది.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒక్క కరోనా పాజిటివ్ వ్యక్తి కొన్ని వేల మందికి వ్యాపింపచేశాడన్న అధ్యయనాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. విదేశాల సంగతి ఇలా ఉంటే మన దగ్గర ఎలా ఉంది? ఒక పాజిటివ్ రోగి.. ఎంతమందికి అంటించే అవకాశం ఉందన్న ఆసక్తికర చర్చ కొద్దిరోజులుగా సాగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఈ విషయం గురించి తాము చేసిన అధ్యయన వివరాల్ని వెల్లడించారు.

ఒక రోగి ఎంతమందికి రోగం అంటిస్తాడనే దాన్ని ఆర్ నాట్ గా వ్యవహరిస్తారని చెప్పారు. కోవిడ్ 19 విషయంలో ఆర్ నాట్ 1.5 నుంచి 4.0 ఉన్నట్లుగా తేల్చారన్నారు. ఒకవేళ ఆర్ నాట్ 2.5గా ఉందని అనుకున్నా.. భౌతిక దూరాన్ని పెద్దగా పాటించకుండా ఉంటే కరోనా పాజిటివ్ రోగి నెలలో 406 మందికి వ్యాపించే అవకాశం ఉందని తేల్చారు.

అదే సమయంలో ప్రజలు భౌతికదూరాన్ని పక్కాగా పాటిస్తుంటే మాత్రం.. పరిస్థితులు మరోలా ఉంటాయని చెబుతున్నారు. ఒక కరోనా రోగి భౌతికదూరాన్ని పక్కాగా పాటిస్తే నెలలో అతడు మహా అయితే 2.5 మందికి మాత్రమే అంటించే అవకాశం ఉందంటున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే భౌతికదూరానికి మించింది.. లాక్ డౌన్ కు సాటి రాగలిగింది మరొకటి లేదనే చెప్పాలి. సో.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కరోనా విషయం లో మాత్రం భౌతిక దూరానికి మించింది మరొకటి లేనట్లే.