Begin typing your search above and press return to search.

గ్రామాల్లో ఆ ఆస్తులకు సర్టిఫికేట్లు .. జగన్ సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   2 Aug 2021 9:54 AM GMT
గ్రామాల్లో ఆ ఆస్తులకు సర్టిఫికేట్లు .. జగన్ సర్కార్ కీలక నిర్ణయం !
X
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠాల్లో ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఇల్లు, ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. 100 గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల వరకు ఆస్తులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. గ్రామ కంఠాల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యింది.

ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు మ్యాప్‌ లలో మార్కింగ్‌ కూడా చేశారు. వీటిని పంచాయతీరాజ్‌ శాఖకు సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయతీరాజ్‌ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపనుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. అలాగే క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే, వాటి వివరాలను మ్యాప్‌కు జత చేసి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరాలను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్‌లను తయారు చేస్తారు. తుది మ్యాప్‌ లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తారు.

పంచాయతీరాజ్‌ శాఖ ఒక్కొక్క ఆస్తికి, దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్‌ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయంటున్నారు అధికారులు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్‌లు సిద్ధమయ్యాయి. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు.