Begin typing your search above and press return to search.

కేంద్రం చివరి అవకాశం..దిగొచ్చిన ట్విట్టర్ !

By:  Tupaki Desk   |   10 Jun 2021 5:30 AM GMT
కేంద్రం చివరి అవకాశం..దిగొచ్చిన ట్విట్టర్ !
X
కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త నిబంధనలను ఇన్నాళ్లు ఏ మాత్రం పట్టించుకోని ట్విట్టర్.. కేంద్రం ఫైనల్ వార్నింగ్‌తో ఎట్టకేలకు దిగొచ్చింది. భారత చట్టాలకు కట్టబడి ఉంటామని తెలిపింది. అయితే, నిబంధనల అమలుకు మరికొంత సమయం కావాలని కోరింది. కొత్త నిబంధనల మేరకకు భారత్‌ లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను ఒప్పంద ప్రాతిపదికన నియమించినట్లు ట్విటర్ ఇండియా పేర్కొంది. అంతేకాదు చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది ట్విటర్.

ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఫిబ్రవరి 25న నోటిఫై చేసినట్లు గుర్తు చేసింది. అయితే, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వెంటనే నిబంధనల అమలు ఆలస్యమవుతోందని వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌‌పై ట్విటర్ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. భారత్‌ లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ జూన్ 5న నోటీసులు జారీచేసింది. వెంటనే భారత్‌ లో అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్విటర్ దిగొచ్చింది. కగా, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021ని నోటిఫై చేసింది. వార్తా వెబ్‌ సైట్లు, ఓటీటీలు, సోషల్ మీడియాకు సంబంధించిన ఆ కొత్త రూల్స్ మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు భారత్‌ లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి.

అయితే , కేంద్రం విధించిన గడువు ముగిసినప్పటికీ.. ట్విటర్ సహా పలు సామాజిక మాధ్యమాలు మాత్రం కొత్త నిబంధనలను పాటించడం లేదు. నిబంధనల ప్రకారం భారత్‌లో చీఫ్‌ కంప్లియన్స్‌ ఆఫీసర్‌లను నియమించాల్సి ఉంది. కానీ ట్విటర్ ఇప్పటికీ ఆ పనిచేయలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌ కు చెందిన వ్యక్తులను కూడా నియమించలేదు. ఈ క్రమంలోనే ట్విటర్ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు గత వారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతల ట్విటర్ ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగించింది. ట్విటర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మనదేశంలో ట్విటర్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో వెంటే దిగొచ్చిన ట్విటర్, మళ్లీ బ్లూటిక్‌ ను పునురుద్ధరించింది. తాజాగా కొత్త నిబంధనలను అమలు చేస్తామని ట్విట్టర్ ప్రకటించింది.