Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ కు కేంద్రం షాక్

By:  Tupaki Desk   |   28 Nov 2021 6:38 AM GMT
ఎలాన్ మస్క్ కు కేంద్రం షాక్
X
ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించి దేశాన్ని ఒక ఊపు ఊపేయాలని కలలుగన్న స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మనదేశంలో ఇంటర్నెట్ సేవల రంగంలోకి ప్రవేశించిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ పేరుతో ఇంటర్నెట్ సేవలను అందించటానికి రెడీ అవుతోంది. ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్ధ మనదేశంలోకి కూడా ప్రవేశిస్తోంది. ఇప్పటికే సుమారు 6500 మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది.

తిరిగి ఇచ్చే పద్దతిలో డిపాజిట్లను సేకరిస్తున్న ఈ కంపెనీ 2 లక్షల చందాదారులను చేర్చుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది. అయితే కంపెనీ ఎప్పుడు ప్రారంభించేది, ఇంటర్నెట్ సేవలు ఎప్పటినుండి తమ ఖాతాదారులకు అందిస్తుందనే విషయంలో స్పష్టత లేనప్పటికీ యాజమాన్యం మాత్రం చందాదారులను చేర్చేసుకుంటోంది. ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీ చందాదారులను చేర్చుకోవటం పూర్తిగా చట్ట విరుద్ధం. ఎందుకంటే కంపెనీకి ఇంకా లైసెన్సు రాలేదు. లైసెన్సు రాకుండానే చందాదారులను చేర్చుకోవటం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఇదే విషయాన్ని తాజాగా కేంద్రం కంపెనీ యాజమాన్యానికి స్పష్టంగా చెప్పింది. చెప్పటమే కాకుండా వెంటనే చందాదారులను చేర్చుకోవటం ఆపేయాలని ఆదేశించింది. చందాదారులను చేర్చుకోవటంపై నిషేధం విధించింది.

ఒకవైపు యాజమాన్యానికి షాక్ ఇచ్చిన కేంద్రం ఇదే విషయాన్ని కేంద్రం ప్రజలకు కూడా స్పష్టం చేసింది. లైసెన్సు కూడా లేని కంపెనీకి చందాదారులుగా ఎవరు చేరద్దని కేంద్రం ప్రజలకు సూచించింది. లైసెన్సు లేకపోయినా కంపెనీకి చందాదారులను చేర్పిస్తున్న యాజమాన్యాలకు మనదేశంలోని చట్టాలంటే ఎంత చులకనో అర్ధమైపోతోంది. లైసెన్సు తీసుకున్న తర్వాత కానీ చందాదారులను చేర్పించుకోవటం, పనులు మొదలు పెట్టడం చేయకూడదని స్పష్టంగా చెప్పేసింది.

స్టార్ లింక్ పేరుతో ఇంటర్నెట్ సేవలు అందించటం కోసం ఇప్పటికే ఎలాన్ మస్క్ వందలాది శాటిలైట్లను ప్రయోగించారు. నిజానికి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించటంలో ఎంతో నాణ్యత ఉంటుంది. కానీ ఇపుడు ఇంటర్నెట్ అందిస్తున్న కంపెనీలన్నీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా మాత్రమే అందిస్తున్నాయి. కానీ స్పెస్ ఎక్స్ కంపెనీ మాత్రం శాటిలైట్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ అందిస్తోంది. మొత్తం 42 వేల శాటిలైట్లను ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి ఇంతకాలానికి కేంద్రం మేల్కొంది. మరి మస్క్ ఏమి చేస్తారో చూడాలి.