Begin typing your search above and press return to search.

'5జీ 'కే కేంద్రం మొగ్గు... 25 వేల కోట్లు కేటాయింపు

By:  Tupaki Desk   |   9 Jun 2021 5:30 PM GMT
5జీ కే కేంద్రం మొగ్గు... 25 వేల కోట్లు కేటాయింపు
X
ప్ర‌తి బుధ‌వారం కేంద్ర కేబినెట్ భేటీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈరోజు కూడా భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొన్ని స్వీట్ నిర్ణ‌యాలు తీసుకోగా.. మ‌రికొన్ని హాట్ నిర్ణ‌యాలు తీసుకుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అవేంటంటే..

+ సెల్ ఫోన్ల‌కు సంబంధించి 5జీ స్పెక్ట్ర‌మ్‌పై వివాదం న‌డుస్తోంది. దీని వ‌ల్ల ప‌క్షులు, పిట్ట‌ల‌తోపాటు ప్రాణికోటికి కూడా తీవ్ర న‌ష్టం ఉంద‌ని ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ స‌మ‌యంలో 5జీ స్పెక్ట్ర‌మ్‌కు కేంద్ర కేబినెట్ ప‌చ్చ జెండా ఊపింది.

+ వ‌చ్చే ఐదేళ్ల‌ కాలంలో దేశ‌వ్యాప్తంగా 5జీ సేవ‌ల‌ను అమ‌లు చేసేందుకు రూ.25 వేల కోట్ల‌ను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

+ ఖరీఫ్ కాలానికి సంబంధించిన పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు 452 రూపాయలను పెంచారు. మినుములు క్వింటాలుకు 300 రూపాయలకు పెంచారు.

+ వరి మద్దతు ధర గతంలో 1,868 రూపాయలుండగా, ఈ ఖరీఫ్ కాలానికి గాను 1,940 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జొన్నలు, ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరను కూడా పెంచుతున్నారు.

+ రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ఆధునికీకరణ విషయంలో కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైల్వేలకు 700 మెగాహెర్జ్ట్ బ్యాండ్‌ లో ఐదు మెగాహెర్జ్ట్ స్ప్రెక్టమ్‌ను అందిస్తారు. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుపడుతుందని కేంద్ర కేబినెట్ భావిస్తోంది.

+ ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దీనిస్థానంలో స్ప్రెక్టమ్ వాడితే రేడియో కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుందనేది కేంద్రం చెబుతున్న మాట‌.