Begin typing your search above and press return to search.

కరోనా ట్రీట్మెంట్ కి కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ..వారికి రెమ్‌డెసివిర్‌ వద్దు !

By:  Tupaki Desk   |   10 Jun 2021 5:09 AM GMT
కరోనా ట్రీట్మెంట్ కి కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ ..వారికి రెమ్‌డెసివిర్‌ వద్దు !
X
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మూడో వేవ్ విలయం మొదలైన దరిమిలా, భారత్ లోనూ అది తప్పదని, తొలి, రెండో దశల్లో వృద్దులు, యువకులను బలితీసుకున్న మహమ్మారి, మూడో దశలో చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందనే రిపోర్టులు వెలువడటం తెలిసిందే. అయితే, మన దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తలెత్తబోదని, చిన్నపిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్రం భరోసా ఇస్తున్నప్పటికీ, చిన్న పిల్లలకు కరోనా చిత్సపై కీలక మార్గదర్శకాలను జారీచేసింది. చిన్నారులు కరోనా ప్రభావితమయితే దానికి సంబంధించిన చికిత్స, నిర్వహణ పద్దతులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ బుధవారం ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సోకిన చిన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్‌ డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్‌ సీటీ స్కాన్‌ ను తీయించాలని చెప్పింది. స్టెరాయిడ్లను కూడా దాదాపు అవాయిడ్ చేయాలని, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్ గా భావించాలని, ఎందుకంటే లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి ఇవి హానికరమని కేంద్రం పేర్కొంది. కరోనా సోకిన తర్వాత, తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్‌ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది.

పిల్లలకు కరోనా టెస్టులకు సంబంధించి గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్‌ ఆక్సీమీటర్‌ సాయంతో వారి ఆక్సిజన్‌ స్థాయులు తెలుసుకోవాలని, ఆక్సిజన్‌ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలని పేర్కొంది. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మే చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 9,300 మందికి పైగా చిన్నారులు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) వెల్లడించింది. ఇలాంటి బాలల సంక్షేమం కోసం ఆరంచెల పథకాన్ని ప్రారంభించామని సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్‌ అఫిడవిట్‌ను సమర్పించింది.