Begin typing your search above and press return to search.

మునుగోడులో ఏ కులమెంతో తెలుసా? ఎమ్మెల్యే లు మాత్రం వారే..

By:  Tupaki Desk   |   12 Aug 2022 11:34 AM GMT
మునుగోడులో ఏ కులమెంతో తెలుసా? ఎమ్మెల్యే లు మాత్రం వారే..
X
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. కాంగ్రెస్ కు దశాబ్దాలుగా పట్టున్న ఈ స్థానంలో.. ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అసలే మాత్రం బలం లేని బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. అధికార టీఆర్ఎస్ గతంలో ఓసారి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వర్గ రాజకీయాలతో సతమతం అవుతోంది. అక్కడ ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడికి మరోసారి టిక్కెట్ ఇవ్వనున్నట్లు కథనాలు రావడంతో అసమ్మతి వర్గం అడ్డం తిరుగుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ సారథ్యంలో తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుపోతోంది. రేవంత్ స్వయంగా రెండు మండలాల్లో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఇదీ చరిత్ర

మునుగోడు MLAగా 1967, 1972లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి(INC)ఉజ్జిని నారాయణరావు(CPI)పై గెలిచారు.1978లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కంచర్ల రామకృష్ణారెడ్డి(JP)పై గెలిచారు,1983లో బొమ్మగాని ధర్మబిక్షం(CPI)పై గెలిచారు.1985లో ఉజ్జీని నారాయణ రావు(CPI) మునగాల నారాయణరావు(INC)పై గెలిచారు,1989లో ఉజ్జినీ నారాయణ రావు(CPI) పాల్వాయి గోవర్దన్ రెడ్డి(INC)పై గెలిచారు,1994లో UNరావు(CPI) పాల్వాయి గోవర్దన్ రెడ్డి(IND)పై గెలిచారు,1999లో పాల్వాయి గోవర్దన్ రెడ్డి(INC) జేల్లా మార్కండేయ(TDP)పై గెలిచారు,2004లో పల్లా వెంకట్ రెడ్డి(CPI) కాశీనాథ్(TDP)పై గెలిచారు,2009లో ఉజ్జిని యాదగిరిరావు(CPI) పాల్వాయి గోవర్దన్ రెడ్డి(INC)పై గెలిచారు,2014లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(TRS) పాల్వాయి స్రవంతి(IND)పై గెలిచారు,2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(INC) కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(TRS)పై గెలిచారు.

సామాజిక వర్గాల వారీ చూస్తే

మునుగోడు గ్రామీణ నియోజకర్గం. అందులోనూ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కంటే బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గమని చెబుతారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. మునుగోడులో గౌడ్ లు అత్యధికంగా 36 వేల మంది ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజ్ లు 34 వేలు, మాదిగలు 26 వేలు, యాదవులు 22 వేలు, మాలలు 12 వేలు, గిరిజనులు 11 వేలు ఉన్నారు. వీరంతా పదివేల సంఖ్య పైబడి ఉన్నారు.

ఇక పది వేలలోపున వడ్డెరలు (9 వేలు), కుమ్మరులు (9వేలు), విశ్వబ్రాహ్మణులు (9 వేలు), ముస్లింలు (దగ్గర దగ్గరగా 10 వేలు) ఉన్నారు. అయితే, అత్యధిక సార్లు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా దాదాపు 10 వేలు ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం వారు 7 వేలు ఉండడం గమనార్హం. ఆర్య వైశ్య, మున్నూరు కాపు, వెలమ వంటి కులాల వారు 4 వేల చొప్పున ఉన్నారు.

2 లక్షల ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలవే

మునుగోడులో 2 లక్షల ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలవే ఉన్నాయి. ఓసీల ఓట్లు 25 వేల ఓట్లున్నాయి. అయితే, ఇక్కడి నుంచి 1990ల్లో బీసీ అభ్యర్థులు ఎవరికీ పోటీకి అవకాశం చిక్కలేదు. రెడ్డి, వెలమ నాయకత్వమే అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచింది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ పేరిట పార్టీ స్థాపించిన ఉద్యమకారుడు, ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వంటివారు మునుగోడు నియోజకర్గం వారు కావడం గమనార్హం.

అయితే, ఓటర్లు ఒక సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉన్నంత మాత్రాన తమ కులం అభ్యర్థికే ఓటేయరని చెప్పేందుకు మునుగోడు ఓ ఉదాహరణ. ఇక్కడ గత ఎన్నికల్లో ఒక కులం వారు అత్యధికంగా ఉన్న గ్రామాల్లోనూ వారి కులం అభ్యర్థికి మెజార్టీ రాని విషయాన్ని రాజకీయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు.